● అవినీతి కప్పిపుచ్చుకునేందుకే
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాడ్డాక నిర్వహించిన మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులవుతారని, అయితే రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా అనర్హత సాధించి వారికి టీచర్ పోస్టులు దక్కాయని ఆరోపించారు. అర్హత సాధించినా తమకు డీఎస్సీలో టీచర్ ఉద్యోగం రాలేదని 200 మంది హైకోర్టును ఆశ్రయించినా చంద్రబాబు ప్రభుత్వానికి చలనం లేదన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రంలో అవినీతి పాలనపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. ముగిసిన మద్యం కేసులో కేఎన్ఆర్ పాత్ర ఉందని సిట్ విచారణకు అదేశించడం, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర రావుపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజలను తప్పదోవ పట్టించడమేనన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లికార్జున, నాయకులు వాల్మీకి రామాంజినేయులు, వెంకటేశ్వర్లు, గుండయ్య, ఎల్లప్ప, భాస్కర్, హనుమంతప్ప, నాగేంద్ర, శివ, రాజు, వరుణ్, శేఖర్, బాషా, మల్లయ్య, గౌస్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రి లోకేష్ను కలిసిన వారికే టీచర్ పోస్టులు
విద్యాశాఖ మంత్రి లోకేష్కు డబ్బులు ఇచ్చిన అనర్హులకే టీచర్ పోస్టులు దక్కాయని రాష్ట్రంలో ప్రతి నోటా వినుపిస్తోందని ఎమ్మెల్యే అన్నా రు. ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడితే కేసులు బనాయిస్తారని అభ్యర్థులు భయపడుతున్నారన్నారు. డీఎస్సీలో జరిగిన అవినీతిపై సోషల్ మీడియాలో, మీడియాలో, పత్రికల్లో వార్తలు వస్తున్నా మంత్రి లోకేష్ స్పందించడం లేదన్నారు. అర్హులకు కాకుండా ముడుపులు అందించిన అనర్హులకు పోస్టులు పంచిపెట్టారని ఆరోపించారు.


