మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం రాఘవేంద్రస్వామి ప్రత్యేక దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరించారు. భక్తుల రాకతో శ్రీమఠంలో రద్దీ కనిపించింది. మూల బృందావన దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. వేసవి సెలవులతో పాటు బక్రీద్ సెలవు ఉండటంతో వేకువజామున నుంచి భక్తుల తాకిడి మొదలైంది. తుంగభద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. మంచాలమ్మ ప్రత్యేక పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాఘవేంద్రుల మూలబృందవానికి శ్రీమఠం పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేపట్టి మంగళ హారతులు గావించారు. వాహనాల రద్దీతో మంత్రాలయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు అవస్థలు పడ్డారు.


