తుగ్గలి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరించాలని జేసీ నూరుల్ఖమర్ ఆదేశించారు. బుధవారం మండలంలోని జొన్నగిరి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ ఓబులేసుతో కలిసి జొన్నగిరి, జీ.ఎర్రగుడి, పగిడిరాయి రెవెన్యూ గ్రామాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసుకుని పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించి 30 అర్జీలు, ఇతర సమస్యలపై 4 అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవి, ఎంపీడీఓ విశ్వమోహన్, డీటీ సుదర్శన్, రీ సర్వే డీటీ మధుమతి, ఆర్ఐ వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.


