మొరాయించిన ఎన్ఎంఎంఎస్ సర్వర్
హాజరు నమోదుకు గంటల తరబడి నిరీక్షణ
హాలహర్వి: జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రవేశపెట్టిన డిజిటల్ హాజరు విధానం కూలీలకు తలనొప్పిగా మారింది. పారదర్శకత పేరుతో ప్రభు త్వం తీసుకొచ్చిన ఫేస్రికగ్నిషన్ హాజరు విధానం క్షేత్రస్థాయిలో విఫలమవుతోంది. సిగ్నల్ సమస్యకు తోడు ఎన్ఎంఎంఎస్ యాప్ సర్వర్ లోపాల కారణంగా హాజరు నమోదు కోసం కూలీలు ఎండలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మండలకేంద్రమైన హాలహర్విలో బుధవారం ఉపాధి పనుల ప్రదేశంలో ఇదే పరిస్థితి ఎదురైంది.
– మధ్యాహ్నం వరకు వేచి చూసినా....
నిబంధనల ప్రకారం ఉపాధి పనుల వద్ద ఉదయమే కూలీల గ్రూపు ఫొటోతో పాటు ఆన్లైన్ హాజరు నమోదు చేయాలి. అయితే హాలహర్విలో బుధవారం ఉదయం నుంచి సర్వర్ బిజీగా ఉండడంతో యాప్ అస్సలు ఓపెన్ కాలేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు ఫోన్ పట్టుకుని ఎండలో సర్వర్ ఎప్పుడు వస్తుందా అని గంటల తరబడి నిరీక్షించారు. చివరకు మధ్యాహ్నం వేళ అతికష్టం మీద హాజరు నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. హాజరు పడకపోతే కూలీలు ఆ రోజు చేసిన కష్టమంతా వృథా అయినట్టే. తమ కడుపుకొట్టే ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికి పాత పద్ధతిలోనే హాజరు సేకరించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.


