స్వలాభం కోసమే ‘సీమ’ తాకట్టు
బొమ్మలసత్రం: సాగునీరు అందక, పంటలు చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు తన స్వలాభం కోసం తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఇలాగైతే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీలు తలారి రంగయ్య, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రా రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి, ఎస్ఈసీ మెంబర్ కల్లూరి రామలింగారెడ్డి, సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, స్టేట్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, స్టేట్ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్రెడ్డి, స్టేట్ మైనారిటీ సెక్రటరీ యూనూస్ బాషా, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రరెడ్డి, జిల్లా యూత్వింగ్ ప్రెసిడెంట్ గుండం నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు.
ఓటుకు నోటు కేసుకు భయపడి ..
విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. అనంతపురం నివాసి చిలకూరి నారాయణ నంద్యాల గడ్డపై నిలబడి 1982లో రాయలసీమ అని నామకరణం చేశారన్నారు. రాయలసీమలో కరువు ఉండకూడదనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారన్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు నిలిపివేయటం దారుణమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే సాగు, తాగునీరే కాకుండా స్నానాలకు కూడా నీరు దొరకని పరిస్థితులు ఎదురవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను మధ్యలోనే తరలించుకుపోయేందుకు ఎన్నో ప్రాజెక్ట్లు నిర్మించిందన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి సాగునీటి ప్రాజెక్ట్లను గాలికొదిలేశారన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై మాట్లాడకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్ట్ పనులు తిరిగి మొదలుపెట్టకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామన్నారు. ప్రజలు ఈ ప్రాజెక్ట్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే భావితరాలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
చంద్రబాబును నిలదీయాలి
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టనుందన్నారు. ఇందుకు కోసం సీమ ప్రజలు మద్దతు తెలుపుతూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు తన శిష్యుడు రేవంత్రెడ్డికి సీమ ప్రాజెక్ట్లను తాకట్టుపెట్టారన్నారు. ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మా ట్లాడుతూ సీమ బాగుండాలంటే ప్రాజెక్ట్ నిర్మాణాలు అవసరమన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు లేకపోతే రైతులు పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్ట్ల కోసం ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
సీమ రైతుల కోసం ఉద్యమాలు
వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే నెల 1వ తేదీ కడపలో రాయలసీమ జిల్లాల నాయకులతో సాగునీటి ప్రాజెక్ట్లపై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్సార్ హయాంలో రాయలసీమకు 40 వేల క్యూసెక్కుల నీరు అందించేలా చర్యలు తీసుకుంటే ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 వేల క్యూసెక్కుల నీరు అందించేందుకు కృషి చేశారన్నారు. దీన్ని చంద్రబాబు అడ్డుకోవటం సరైందికాదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 80 శాతం పూర్తి చేసిందని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు నిలిపివేయటం దారుణమన్నారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు తన పాలనలో ఎప్పుడు మంచి చేసిన దాఖలాలు లేవన్నారు. రాయలసీమ రైతుల కోసం భవిష్యత్తులో వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపడుతుందని, అందరూ సహకరించాలని కోరారు.
ప్రజలకు సీఎం చంద్రబాబు
సమాధానం చెప్పాలి
ఎత్తిపోతల పథకం నిలిచిపోతే
రాయలసీమ ఎడారిగా మారుతుంది
1న కడపలో ‘సీమ’ నాయకులతో
ఇరిగేషన్ ప్రాజెక్ట్లపై సమావేశాలు
విలేకరుల సమావేశంలో
వైఎస్సార్సీపీ నేతలు


