పోలీస్ పీజీఆర్ఎస్కు 122 ఫిర్యాదులు
కర్నూలు: కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కన క్యాంపు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 122 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ప్రధానంగా ఉద్యోగాలు, రుణాల పేరుతో మోసాలు, భూ ఆక్రమణలు, వ్యక్తిగత సమస్యలు తదితర విషయాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు రామకృష్ణ, విజయలక్ష్మి, మస్తాన్ వలి తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని వినతులు స్వీకరించారు.
బార్ ఏర్పాటుకు రీ నోటిఫికేషన్
కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాల్టీ పరిధిలో బార్ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతితో ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు రీ–నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ బార్ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మూడోసారి బార్ ఏర్పాటుకు లైసెన్స్ జారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సుధీర్ బాబు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రూ.5 లక్షలు తిరిగి చెల్లించని రుసుంతో ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 2వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. కనిష్టంగా నాలుగు దరఖాస్తులు వస్తేనే 4వ తేదీ కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించి లైసెన్స్ దారున్ని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఈఎస్ సుధీర్ బాబు పేర్కొన్నారు.
కర్నూలులో స్టేట్ ఫుడ్ లేబొరేటరీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీ ఆవరణలో స్టేట్ ఫుడ్ లేబొరేటరీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ)తో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్(సీఎస్ఎస్) కింద అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి రూ.19.84 కోట్లను మంజూరు చేసింది.
9లోగా డేటా ఎంట్రీ, ముఖ చిత్రాల ప్రక్రియ పూర్తి కావాలి
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మార్చి 9లోగా ఓటర్ల జాబితా డేటా ఎంట్రీ షీట్, ముఖ చిత్రాల తయారీ ప్రక్రియ పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు సూచించారు. సోమవారం ఎస్ఈసీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి, డివిజినల్ వంచాయితీ అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు వీసీ ద్వారా వర్చువల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 జనవరి 1వ తేది వరకు నిర్ధారించిన అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా ఆయా గ్రామ పంచాయతీల్లోని వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించాలన్నారు. ఈ పక్రియను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. వీసీలో జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్, కర్నూలు డీఎల్పీఓ టి.లక్ష్మి, డీపీఓ కార్యాలయ ఏఓ గీతాప్రతిమ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో డీప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు వీసీలో పాల్గొన్నారు.


