రమణీయం.. జోడు రథోత్సవం
హాలహర్వి: గాదిలింగేశ్వర, కాడ సిద్ధలింగేశ్వరస్వామి జోడు రథోత్సవాన్ని గూళ్యం గ్రామంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలుత ఉత్సవమూర్తులకు ఆకు పూజ, కుంకుమార్చన, జలాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6: 30 గంటలకు రథచక్రాలకు పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు కుంభోత్సవంతో రథం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం పండితులు మంత్రోచ్ఛారణ మధ్య రథ చక్రాలు ముందుకు కదిలాయి. ప్రధాన వీధుల్లో ఇసుకేస్తే రాలనంత జనంతో గూళ్యం జనసంద్రంగా మారింది. జనం జేజేలు పలుకుతుండగా ఒకేసారి రెండు రథాలు కదులుతుంటే గాదిలింగేశ్వరుడి నామస్మరణతో మార్మోగింది. వచ్చిన భక్తులకు అన్నదానం, మంచినీటి వసతిని సర్పంచ్ ఉలిగమ్మ, ఆలయ అధికారులు, గ్రామస్తులు ఏర్పాటు చేశారు. అలాగే వైద్యాధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఆకట్టుకున్న గొరవయ్యల నృత్యాలు
భక్తుల జైజై ధ్వనుల మధ్య ఓ వైపు రథ చక్రాలు ముందుకు కదులుతుండగా మరోవైపు గొరవయ్యల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జోడి రథ చక్రాలపై భక్తులు అరటికాయలను వేస్తూ తమ మొక్కుబడిని చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో సీఐ రవిశంకర్రెడ్డి, ఎస్ఐ ఈశ్వరరావు పోలీసు బందోబస్తు నిర్వహించారు.
అన్నదానం
నిట్రవట్టి, హాలహర్వి, బాపురం గ్రామస్తులు బాపురం నుంచి గూళ్యంకు వెళ్లే రహదారిలో భక్తులకు అన్నదానం, మజ్జిగ, మంచినీటిని అందిస్తూ ఆకలి తీర్చారు. ఏటా రథోత్సవానికి హాజరయ్యే భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు వారు చెప్పారు. డాక్టర తిమ్మయ్య యాదవ్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యశిబిరం నిర్వహించారు.
రమణీయం.. జోడు రథోత్సవం


