ఉయ్యాలవాడ పోరాటం అజరామరం
● వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి
కర్నూలు(అర్బన్): బ్రిటీష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం అజరామరమని వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఏ క్యాంప్ కూడలిలో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీధర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, వైఎస్సార్సీపీ రాయలసీమ జోన్ మహిళా విభాగం అధ్యక్షురాలు, కార్పొరేటర్ గాజుల శ్వేతారెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే నగరం నుంచి ఓర్వకల్ విమానాశ్రయం వద్ద ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వరకు భారీగా కార్ల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులని, రేనాటి సూర్యునిగా కొలవబడే ఆయన 1857 సిపాయిల తిరుగుబాటు కంటే పదేళ్ల ముందే బ్రిటీష్ దుష్టపాలనను ఎదిరించి తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. రాయలసీమలో రాయల కాలం నుంచి పాలెగాళ్లు స్థానికంగా ప్రముఖంగా ఉండేవారన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగాలు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి యువతకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్పొరేటర్లు దండు లక్ష్మికాంతరెడ్డి, సుదర్శన్రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవ మినీత్రెడ్డి, సంఘటన కార్యదర్శి తూముకుంట ప్రతాపరెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, ఇన్నెం రజనీకాంత్రెడ్డి, రమకాంతరెడ్డి, పాటిల్ తిరుమలేశ్వరరెడ్డి, మురళీధర్రెడ్డి, సిద్దం రాజారెడ్డి, సీహెచ్ వెంగల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, హరినాథ్రెడ్డి, పులకుర్తి రంగారెడ్డి, వినీష్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సదాశివరెడ్డి పాల్గొన్నారు.


