మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
సుదర్శన చక్రం అందజేత
కొలిమిగుండ్ల: కోర్నపల్లె గుండం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో నిర్మించిన పట్టాభిరామాలయానికి దాత ఆదివారం సుదర్శన చక్రం అందజేశారు. భారతి సిమెంట్కు చెందిన మైనింగ్ ఇంజినీర్ రమేష్బాబు రూ.1.15 లక్షల వ్యయంతో పంచలోహాలతో కూడిన సుదర్శన చక్రాన్ని తయారు చేయించి ఇచ్చారు. పట్టాభిరాముడిపై భక్తితో సుదర్శన చక్రాన్ని ఇవ్వడంతో ఆలయ కమిటీ సభ్యులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బేతంచెర్ల: ఆర్.కొత్తపల్లె గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల పట్టణానికి చెందిన ఎరుకలి సుబ్బన్న, అతని కుమారుడు నాగ శేషన్న ఆటోలో ఆదివారం ఉదయం డోన్ మండలం ఉంగరాని గుండ్ల గ్రామంలో జరిగే జాతరలో తాళ్లను విక్రయించేందుకు బయలు దేరాడు. మార్గమధ్యలో ఆర్.కొత్తపల్లె గ్రామం దాటిన రహదారిపై వరిగడ్డి ట్రాక్టర్ నిలిపి ఉంచడంతో ప్రమాదవశాత్తూ ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్బన్నకు (76) తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బేతంచెర్లకు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కొడుకు నాగశేషన్న ఫిర్యాదు మేరకు ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ తలారి రమేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు.
గురుకుల విద్యార్థి అదృశ్యం
కల్లూరు: చిన్నటేకూరు గురుకుల కళాశాలలో ఇంటర్ చదవుతున్న విద్యార్థి మాధవ స్వామి అదృశమయ్యాడు. ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ తెలిపిన వివరాలు... నంద్యాల జిల్లా అవులదొడ్డి గ్రామానికి చెందిన శేఖర్ కుమారుడు మాధవస్వామి చిన్నటేకూరు గురుకుల కళాశాలలలో ఇంటర్ చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లాడు. సెలవులు ముగిసిశాక జనవరి 21న కళాశాలకు వచ్చాడు. కళాశాలలో అధ్యాపకుల పరిమిషన్తో అదే రోజు బయటకు వెళ్లి, సాయంత్రమైన కళాశాలకు రాకపోవడంతో అధ్యాపకులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వెల్దుర్తిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి
వెల్దుర్తి: స్థానిక సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో వారం క్రింత జ్వరంతో చేరుకున్న 40 ఏళ్ల బోయనపల్లె రంగస్వామి స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. ప్రాథమిక దశలో ఉండడంతో చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధితో మరణాలు సంభవించడంతో ఆందోళన పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న నల్లుల ద్వారా వ్యాపించే ‘స్క్రబ్ టైఫస్’ గురించి భయపడాల్సింది లేదన్నారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే చికిత్స సులభమవుతుందని, పూర్తిగా నయమవుతుందని తెలిపారు.
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు సీ క్యాంప్ సెంటర్లో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండగా, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించగా, కోలులేక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గత నెల 11న ఆసుపత్రిలో చేరిన ఈ వ్యక్తి ఈ శనివారం మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి మూడో పట్టణ పోలీసులకు మృతి సమాచారం అందడంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారించారు. ఆచూకీ తెలిసిన వారు 9121101061 లేదా 08518–277187కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ శేషయ్య విజ్ఞప్తి చేశారు.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు


