
7న జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయండి
కర్నూలు(అర్బన్): ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నియామకాలకు స్క్రీనింగ్ పరీక్ష నేపథ్యంలో ఈ నెల 7న ఆయా పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జీరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసి వేయాలని ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయా పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్, నెట్ సెంటర్లను ఆయా సమయాల్లో మూసివేయాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
19న పోస్టల్ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ
కర్నూలు(అర్బన్): తపాల శాఖ కార్యాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ నెల 19న స్వీకరిస్తామని కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టు ద్వారా ఫిర్యాదులను పంపే వారు కవర్పై డాక్ అదాలత్ అని పెద్ద అక్షరాలతో రాసి ఈ నెల 15వ తేది లేదా అంతకు ముందే తమకు చేరేలా పంపాలన్నారు. ఫిర్యాదుదారులు నేరుగా 19న ఉదయం 11 గంటలకు నిర్వహించే డాక్ అదాలత్కు హాజరు కావచ్చన్నారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం అర్జీ పరిష్కార లెటర్, ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తామన్నారు.
కర్నూలు సర్కిల్ ఎస్ఈకి అదనపు బాధ్యతలు
కర్నూలు సిటీ: జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్గా పని చేస్తున్న బి.బాల చంద్రారెడ్డికి శ్రీశైలం డ్యాం నిర్వహణ పర్యవేక్షక ఇంజనీర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం డ్యాం నిర్వహణ పర్యవేక్షక ఇంజనీర్ పోస్టు రెండున్నర నెలలుగా ఖాళీగా ఉంది. జూన్ నెలలో అక్కడ పర్యవేక్షక ఇంజనీర్గా పని చేస్తున్న పి.శ్రీరామచంద్రమూర్తి పదోన్నతిపై కడప ప్రాజెక్ట్స్ సీఈగా వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ గత నెల 31న పదవీ విరమణ పొందారు. దీంతో ఆ స్థానంలో బి.బాల చంద్రారెడ్డికి అదన పు బాధ్యతలు అప్పగించారు.
ఉర్దూ వర్సిటీ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్ : డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో గత ఏప్రిల్ నెలలో జరిగిన పీజీ రెండు, నాలుగో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ పీఎస్ షావలి ఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.లోకనాథ్ విడుదల చేశారు. ఎంఏ ఉర్దూ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనా మిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ బా టనీ, ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ, ఇండస్ట్రియ ల్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ https:// ahuuk. ac. in/ నుంచి పొందగలరని తెలిపారు. ఫలితాల విడుదలకు కృషి చేసిన ఎగ్జామినేషన్ విభాగం సిబ్బందిని వారు అభినందించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మహబూబ్ బాషా, ఎగ్జామినేషన్ విభాగం సైన్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నబియా సుల్తానా, ఆర్ట్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ బి.వెంకటప్ప, సిబ్బంది బి.మురళి, మరియా ఖాతున్ పాల్గొన్నారు.
4, 5 తేదీల్లో కర్నూలు మార్కెట్ యార్డుకు సెలవు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 4, 5 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఈనెల 4వ తేదీ వినాయక నిమజ్జనం, 5వ తేదీన మిలాద్–ఉన్–నబి ఉన్నందున మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా రోజుల్లో మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డలతో సహా ఎలాంటి పంటలను కొనుగోలు చేయడం జరగదన్నారు. 6వ తేదీ నుంచి యథావిధిగా అన్ని పంటల క్రయవిక్రయాలు కొనసాగుతాయన్నారు.

7న జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయండి