మూణ్ణాళ్ల ముచ్చటే !
కొంగంచర్ల, కవిపురం బీటీ రోడ్లు నిర్మాణంలో డొల్లతనం రోజుల వ్యవధిలో కొత్త రోడ్డు దెబ్బతిన్న వైనం నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు తూతూమంత్రంగా అధికారుల పర్యవేక్షణ రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చకు వచ్చేనా ?
పెడన: రహదారులు గుంతలు మయంగా మారాయని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు ఇప్పుడు వేసిన రోడ్లు నిర్మాణాలు చేపట్టి రోజులు గడవక ముందే దెబ్బతినడంపై ఏ సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని కొంగంచర్ల గ్రామానికి, అలాగే గురువిందగుంట, కవిపురం గ్రామాలకు వేసిన బీటీ రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆయా రోడ్లకు రూ.81 లక్షలు మంజూరయ్యాయి. రహదారుల పనులు ప్రారంభించిన పిమ్మట ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
రేపు మండల పరిషత్ సమావేశం..
అధికారం చేపట్టిన ఏడాదిన్నర తరువాత ఆయా రోడ్లకు మోక్షం లభించడంతో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడి వరకు పరిస్థితి బాగానే ఉంది. రోడ్డు నిర్మించిన కొన్ని రోజులకు ఆయా రోడ్లు బీటలు వారడంపై ఆయా గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. నాణ్యతాప్రమాణాలు పాటించారా లేక చేతులు దులుపుకోవడానికే రోడ్లు వేశారా అనే సందేహాలను వెలిబుచ్చుతున్నారు. ఈ నెల 10వ తేదీన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో రోడ్డు నాణ్యతా ప్రమాణాలపై సభ్యులు ప్రశ్నిస్తారా లేదా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
మూణ్ణాళ్ల ముచ్చటే !


