జీజీహెచ్‌కు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరికరాలు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌కు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరికరాలు

Jan 30 2026 6:34 AM | Updated on Jan 30 2026 4:45 PM

Gadde Rammohan along with GGH Superintendent Dr. Annavarapu Venkateswara Rao unveiled the project.

గద్దే రామ్మోహన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అన్నవరపు వెంకటేశ్వరరావుతో కలిసి ఆవిష్కరించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ తన నిధుల నుంచి రూ.50 లక్షల విలువగల స్క్రీనింగ్‌ పరికరాలను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి అందజేశారు. వాటిని గురువారం తూర్పు శాసన సభ్యుడు గద్దే రామ్మోహన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అన్నవరపు వెంకటేశ్వరరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ స్క్రీనింగ్‌ పరికరాల ద్వారా గంటకు 60 మందికి స్క్రీనింగ్‌ చేయవచ్చన్నారు. అంతేకాక క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు ఇవి దోహదపడతాయని సూచించారు. మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌కు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సీఎస్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మావతి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఒకటో తేదీన ‘ఇంద్ర’గిరి ప్రదక్షిణ 

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఉంటుందని దుర్గగుడి వైదిక కమిటీ పేర్కొంది. ప్రతి మాసంలో పౌర్ణమిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉండే ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ఊరేగింపు ప్రారంభమవుతుంది. తొలుత ప్రత్యేక పూల వాహనంపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, ఆలయ అధికారులు, సేవా సిబ్బంది పాల్గొననున్నారు.

ముగిసిన జేఎన్టీయూకే ఆటల పోటీలు 

పెనమలూరు: జేఎన్టీయూకే సెంట్రల్‌ జోన్‌ ఇంటర్‌ కాలేజీ చెస్‌, నెట్‌బాల్‌ పోటీలు ముగిశాయి. కానూరు పీవీపీ సిద్ధార్థలో ఈ నెల 27, 28 తేదీల్లో పోటీలు నిర్వహించారు. పురుషుల నెట్‌బాల్‌ పోటీలో పీవీపీ సిద్ధార్థ జట్టు మొదటి స్థానం, భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ జట్టు రెండో స్థానంలో నిలిచింది. నెట్‌బాల్‌ మహిళ పోటీల్లో వీఆర్‌ సిద్ధార్థ జట్టు మొదటి స్థానం, సర్‌ సీఆర్‌రెడ్డి కాలేజీ జట్టు రెండో స్థానం సాధించింది. చెస్‌లో పురుషుల విభాగంలో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ జట్టు మొదటి స్థానం, వీఆర్‌ సిద్ధార్థ జట్టు రెండో స్థానంలో నిలిచింది. మహిళల చెస్‌ పోటీల్లో పీవీపీ జట్టు మొదటి స్థానం, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ జట్టు రెండో స్థానం పొందింది. విజేతలకు జేఎన్టీయూ ఇంటర్‌ కాలేజీల టోర్నమెంట్ల కార్యదర్శి డాక్టర్‌ జీవీ రాజు, పీవీపీ సిద్ధార్థ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కొండపల్లి శివాజీబాబు బహుమతులు ప్రదానం చేశారు.

మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

పెనమలూరు: యనమలకుదురులో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పరిశీలించారు. ఆయన కొండపై వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ పర్యవేక్షణకు ఇక్కడికి వచ్చానన్నారు. ఆలయంలో మౌలిక వసతులు, పార్కింగ్‌ సౌకర్యాలు బాగా ఉన్నాయన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భక్తులకు మెరుగైన ఏర్పాట్లు, బందోబస్తు కల్పిస్తామని తెలిపారు. ఎక్కవ మంది సిబ్బందిని పెట్టడమే కాకుండా డ్రోన్‌తో నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహారావు, ఈవో ఎన్‌.భవాని, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement