
● క్రికెట్ క్రేజ్ను సొమ్ము చేసుకుంటున్న వెబ్సైట్లు,
సాక్షి ప్రతినిధి, విజయవాడ: క్రికెట్ క్రేజ్ అభిమానుల ఉసురు తీసే స్థాయికి తీసుకెళ్లింది. బెట్టింగ్ భూతం అభిమానులను వెంటాడుతోంది. చివరకు అప్పులు పాలై ఆత్మహత్యలు జరుగుతున్న ఘటనలూ ఉన్నాయి. స్మార్ట్ యుగంలో బెట్టింగ్ను వెబ్సైట్, యాప్ నిర్వాహకులు సులభతరం చేసేశారు. ప్రత్యేక ప్రోగామింగ్తో రూపొందించుకున్న యాప్, వెబ్సైట్లను క్రికెట్ అభిమానుల అరచేతిలోకి చేర్చారు. ప్రస్తుతం పలు యాప్ల ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. టాస్ ప్రారంభం నుంచీ, బంతి బంతికీ, మ్యాచ్ ముగిసే వరకు బెట్టింగ్ కొనసాగుతూనే ఉంటుంది. రూ.100కు రూ.500, మ్యాచ్ స్వభావాన్ని బట్టి రూ.500కు 50,000 చెల్లింపులు అంటూ పందెపు రాయుళ్లను ఆకర్షిస్తుంటారు. నగదు లావాదేవీలకు యూపీఐ యాప్లను వినియోగిస్తున్నారు. రాజస్తాన్, పంజాబ్ కేంద్రంగా ఈ దందా కొనసాగు తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
వాడవాడలా..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ భూతం వాడవాడలా విస్తరించింది. విజయవాడ నగరంలోని సీతన్నపేట, శ్రీనగర్కాలనీ, లోటస్, ముత్యాలంపాడు, పటమట, బావాజీపేట, కృష్ణలంక, నున్న, గన్నవరం, ప్రసాదంపాడు, కంకిపాడు, పటమట, చిన అవుటపల్లి, పెద అవుటపల్లి, ఇలా తదితర ప్రాంతాల్లో మెయిన్ బుకీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
రంగంలోకి దించేదిలా...
యాప్/వెబ్సైట్ నిర్వాహకులకు వీరు నేరుగా అందుబాటులో ఉంటారు. వీరి నుంచి కొందరు స్థానిక యువత యాప్/వెబ్సైట్లను ప్రాంచైజీలుగా తీసుకుని క్షేత్ర స్థాయిలోకి బెట్టింగ్ను విస్తరించారు. స్థానికంగా ఉన్న బుకీ ముందుగా ఆ ప్రాంతాల్లోని యువత నంబర్లను సేకరించి వాట్సాప్ చాటింగ్ ద్వారా బెట్టింగ్లోకి దింపుతారు. వారి వాట్సాప్కు యాప్/వెబ్సైట్ లింక్, యూజర్నేమ్, పాస్వర్డ్ పంపుతారు. లింక్ క్లిక్ చేయగానే యాప్/వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అందులోని ఆఫర్లు, మ్యాచ్ జరిగే తీరు ఆధారంగా బెట్టింగ్ జరుగుతుంటుంది. పందెం వేయాలనుకుంటే వాట్సాప్లో స్థానిక బుకీకి మెసేజ్ చేయాలి. అతని నుంచి ఓకే అని మెసేజ్తో పాటు యూపీఐ క్యూఆర్ కోడ్ పంపిస్తారు. దాన్ని స్కాన్ చేసి నగదు చెల్లించి, ఆ స్క్రీన్ షాట్ మళ్లీ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయగానే స్థానిక బుకీ వెబ్సైట్/యాప్లోని బెట్టింగ్ రాయుడి వాలెట్లో నగదు జమ చేస్తాడు. అక్కడ నుంచి బెట్టింగ్ ప్రారంభమవుతుంది.
పోలీసుల అదుపులో బుకీలు
ఉమ్మడి కృష్ణా , గుంటూరు, ఏలూరు జిల్లాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, విదేశాల్లో ఉండి యాప్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే విజయవాడ సీసీఎస్ క్రైం పోలీసులు పలువురిని ఆదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. లక్షకు రూ.1000 కమిషన్ను గ్రామాల్లో ఏజెంట్లకు ఇస్తున్నారు. కాకినాడకు చెందిన పండు రాధే ఎక్స్చేంజ్ బెట్టింగ్ యాప్ తయారు చేయించి, పలువురిని అడ్మిన్గా నియమించుకొని బెట్టింగ్ను విస్తరించారు. ఇప్పటికే పోలీసులు ప్రసాదంపాడుకు చెందిన కట్టవరపు భాను ప్రసాద్, గన్నవరం మండలం అల్లవరానికి చెందిన కె.రత్నబోసు, కంకిపాడు మండలం మంటాడకు చెందిన కొండేటి గురువెంకటదాస్, ఉంగుటూరు మండలం పెద్ద అవుటుపల్లికు చెందిన ఎస్కే సుభాని, చిన్న అవుటపల్లికి చెందిన కాకి సతీష్బాబు, చిల్లి అశోక్కు 41ఏ నోటీసులు ఇవ్వడంతో పాటు, వీరిలో కొంత మందిని అదుపులోకి తీసుకొని...బెట్టింగ్ , బెండ్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు క్రికెట్ అభిమానులు, కోట్లాది రూపాయల డబ్బును పోగొట్టుకున్నట్లు సమాచారం.