ఆసిఫాబాద్: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగే ఉత్తమమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ, నీటి పారుదల, వాతావరణ శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన, నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్షించారు. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రాజెక్టులు, చెరువుల్లోకి పూర్తిస్థాయి నీరు రాకపోవచ్చని తెలిపారు. ఈ క్రమంలో వరి సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పప్పు ధాన్యాలు, కూరగాయలు పండించేలా ప్రోత్సహించాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు రిజర్వాయర్లలో నీటి మట్టంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్ హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం ఉందని తెలిపారు. ప్రాజెక్టులు, చెరువుల కింద వరి సాగు చేసే రైతులు పప్పుధాన్యాలు, ఆయిల్పామ్, ఇతర పంటల వైపు దృష్టి సారించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రాజెక్టుల్లో నీటిమట్టం నిల్వలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.


