కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదాల నివారణకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని ఎస్పీఎంను సందర్శించారు. పరిశ్రమల రక్షణలో భాగంగా నిజామాబాద్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ హెచ్.లక్ష్మికుమారితో కలిసి మాక్డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్లోరిన్, యాసిడ్ వంటి విషపూరిత పదార్థాలు లీకేజీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. టెక్నికల్ నిపుణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎం వైస్ ప్రెసిడెంట్ ఏకే మిశ్రా, జనరల్ మేనేజర్ గిరి, సేఫ్టీ మేనేజర్ శ్రీనివాస్, కమర్షియల్ జీఎం అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఇళ్ల గణన విధులు నిర్వర్తించే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన శిక్షణకు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో గణాంక అధికారి గురువయ్య, మాస్టర్ ట్రైనర్లు ఊషన్న పాల్గొన్నారు.
మ్యాపింగ్ త్వరగా పూర్తిచేయాలి
ఆసిఫాబాద్: ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సెర్ప్ ఏపీఎంలు, వీవోఏలు, సూపర్వైజర్లతో మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా మ్యాపింగ్ కాని ఓటరు వివరాలు సేకరించి.. వారు ఇక్కడికి ఎలా వచ్చారు అనే వివరాలతో పోల్చుకోవాలని సూచించారు. ప్రతిరోజూ పురోగతిని పర్యవేక్షిస్తామని తెలిపారు.


