● తొలిరోజు రెండెకరాల వరకు పెట్టుబడి సాయం ● జిల్లాలో 2.23లక్షల మందికి రూ.127 కోట్లు
ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్ ప్రారంభమైన వేళ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని విడుదల చేస్తోంది. హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పెట్టుబడి సాయం నిధులను విడుదల చేశారు. తొలిరోజు ఎకరాకు రూ.6వేల చొప్పున రెండెకరాల వరకు పెట్టుబడి సాయం విడుదలైంది. ఈమేరకు జిల్లాలో 2,23,910 మంది రైతుల ఖాతాల్లో రూ.127,57,81,680 మేర జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
రైతు వేదికల్లో ప్రత్యక్షప్రసారం
హైదరాబాద్లో రైతు భరోసా నిధుల విడుదల చేయగా, జిల్లాలో 62 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈమేరకు రైతులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు. వైరాలో ఎమ్మెల్యే రాందాస్నాయక్, చింతకాని మండలం నాగులవంచలో కలెక్టర్ దివాకర్ టీ.ఎస్., జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు ధనసరి పుల్లయ్య, ఎం.వీ.మధుసూదన్, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సరిత తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
చింతకాని: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కలెక్టర్ దివాకర తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని నాగులవంచ రైతువేదికలో రైతులతో కలిసి కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడతల వారీగా తొమ్మిది రోజుల్లో నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుందని తెలిపారు. అయితే, వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు పంటమార్పిడి విధానాన్ని అవలంబించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులు ధనసరి పుల్లయ్య, మధుసూదన్, గంగాధర్, మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, సర్పంచ్ నారగాని రాంబాయి తదితరులు పాల్గొన్నారు.


