పాల్వంచ: విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ చేపడితే ప్రజలపై అదనపు భారం పడుతుందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానించడాన్ని నిరసిస్తూ మంగళవారం పాల్వంచలోని అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. అనంతరం సీఈ కార్యాల యం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేటీకరణతో ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యం, భద్రత, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీ చైర్మన్ రాజేందర్, కన్వీనర్ యాస్మిన్తో పాటు బ్రహ్మాజీ, ఉమామహేశ్వరరావు, మహేశ్, రఘువీర్, రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, సీతారాంరెడ్డి, ప్రభాకర్, నరసింహారావు, సయ్యద్, గిరిధర్, మధుబాబు, కళాధర్, సంపత్, పావని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మణుగూరురూరల్: వైటీపీఎస్లోని పలు విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ టీజీపీఈఏ జేఏసీ చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఈమేరకు పదో రోజైన మంగళవారం బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట ఉద్యోగులు బ్యానర్లు, ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీటీజీపీఈఏ కేంద్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.రవిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ యత్నాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్లో బుధవారం జరిగే సమావేశానికి ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. నాయకులు నరేశ్, వి.ప్రసాద్, వెంకట్రాం, సాంబ, టి.శోభన్ తదితరులు పాల్గొన్నారు.


