భద్రాచలంటౌన్: భద్రాచలంలో ఈ నెల 6వ తేదీన జాతీయ ఆదివాసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు జాతీ య ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, సాంస్కృతిక రక్షణ సమన్వయ సమితి జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్యదొర తెలిపారు. భద్రాచలంలోని హరిత హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐదో షెడ్యూల్ ప్రాంతాల పరిరక్షణ, ఆదివాసీల స్వయం పాలన, అటవీ హక్కుల చట్టం అమలుపై చర్చించనున్నట్లు తెలిపారు. అంతేకాక కోయ భాషను రాజ్యాంగ ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడం, ప్రత్యేక మత కోడ్ సాధన, జీఓ 3 పునరుద్ధరణ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, గోదావరి ఇసుక తవ్వకాలు, ఆదివాసీలకు రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో నాయకులు పాయం సత్యనారాయణ, పూనెం కృష్ణ దొర, కుంజా శ్రీనివాసరావు, వర్ష శ్రీనివాసరావు, గొగ్గల రామకృష్ణ, కొమరం శ్రీను తదితరులు పాల్గొన్నారు.


