ఖమ్మంక్రైం: ఖమ్మం కమిషనరేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(సీసీఆర్బీ) ఏసీపీగా అడపా నరసింహారావు నియమితులయ్యారు. అలాగే, సీటీసీ (కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్) ఏసీపీగా బి.హరనాఽథ్బాబును నియమిస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల డీఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వగా ఖమ్మంకు ఇద్దరిని కేటాయించారు. అంతేకాక ఇక్కడ డీఎస్పీలుగా పనిచేస్తూ పదోన్నతి పొందిన సి.రాజిరెడ్డికి సీఐడీ డీఎస్పీగా, టి.స్వామికి కరీంనగర్ సీసీఆర్బీ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.
సైన్స్ మ్యూజియం
నిర్వహణపై ఆరా
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని జిల్లా సైన్స్ మ్యూజియాన్ని డీఈఓ సదానందం సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడి ఎగ్జిబిట్లు, నిర్వహణ ఆరా తీశాక మాట్లాడారు. ప్రభుత్వ సెలవుల్లో తప్ప ప్రతిరోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు మ్యూజియం తెరిచే ఉంటున్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది విద్యార్థులు సందర్శించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే, మ్యూజియం కోసం నియమించిన ముగ్గురు ఇన్స్ట్రక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, సైన్స్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజన నిరుద్యోగ యువతకు 3 – 4 నెలల పాటు వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎన్.విజయలక్ష్మి తెలిపారు. ఖమ్మంలోని ఐటీడీఏ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో వేర్హౌస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, బ్యూటీషియన్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ (ఫుడ్ అండ్ బేవరేజ్) లెవల్–4, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ అసోసియేట్ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది పేర్కొన్నారు. వేర్హౌస్ ఎగ్జిక్యూటివ్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ అసోసియేట్ కోర్సులకు ఎస్సెస్సీ, అంతకు మించి, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు ఇంటర్, బ్యూటీషియన్ కోర్సుకు 8వ తరగతి ఆపై విద్యార్హత కలిగి ఉండాలని, బ్యూటీషియన్ కోర్సుకు 18–35 ఏళ్ల వయస్సు, మిగిలిన కోర్సులకు 18 – 30 వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం సమకూర్చి యూనిఫామ్, స్టడీ మెటీరియల్ ఇవ్వడమే కాక పూర్తయ్యాక సర్టిఫికెట్ జారీ చేస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు ఆధార్ కార్డు, కుల, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో జూలై 1న ఉదయం 9గంటలకు ఖమ్మం రోటరీనగర్లోని ఐటీడీఏ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో ఇంటర్వ్యూకు హాజరుకావాలని, వివరాలకు 63058 02724 నంబర్లో సంప్రదించాలని డీడీ సూచించారు.
అర్హుల ఓట్లు కోల్పోకుండా పర్యవేక్షణ
ముదిగొండ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా అర్హుల ఓట్లు తొలగించకుండా పార్టీ బీఓల్ఏలు పర్యవేక్షించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచించారు. ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో సోమవారం ఆయన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించి మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ, మ్యాపింగ్ వివరాలు తెలుసుకున్న ఆయన ఫారాలు నింపడంపై ఓటర్లకు బీఎల్ఏలు, బీఓల్ఓలు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వల్లాపురంలో పలు కార్యక్రమాలకు ఎమ్మెల్సీ హాజరయ్యారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ కమల్రాజు, నాయకులు సామినేని హరిప్రసాద్, లక్ష్మారెడ్డి, గడ్డం వెంకట్గౌడ్, తోట ధర్మరావు, బంకా మల్లయ్య పాల్గొన్నారు.


