గ్రీవెన్స్ డేలో అదనపు కలెక్టర్ శ్రీజ
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో అందే దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆమె అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి(రెవెన్యూ)తో కలిసి ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన శ్రీజ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో డీఆర్వో రామమూర్తి, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
18.50 అడుగులకు చేరిన పాలేరు
కూసుమంచి: సాగర్ నుంచి నీరు విడుదల చేస్తుండడంతో పాలేరు రిజర్వాయర్లో నీటిమట్టం సోమవారం 18.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 23అడుగులకు గాను ఇటీవల 12 అడుగులకు పడిపోయింది. దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా నాలుగు రోజుల నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తుండగా 18.50 అడుగులకు చేరింది. ప్రస్తుతం సాగర్ నుంచి 2962 క్యూసెక్కుల నీరు చేరుతుండగా ఇది మరింత పెరుగుతుంది. కాగా, పాలేరు రిజర్వాయర్ను సోమవారం జల వనరులశాఖ సీఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. నీరు వృథా కాకుండా తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని ఉద్యోగులకు సూచించారు.


