ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. మార్చి 14నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 16,975 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 98 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద అవసరమైన మేర భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాల ఏర్పాటుపై సూచనలు చేశారు. ప్రతీ ఫ్లయింగ్ స్క్వాడ్లో డిప్యూటీ తహసీల్దార్, ఎస్ఐ సభ్యులుగా ఉండాలని తెలిపారు. అలాగే, ప్రశ్నపత్రాల తరలింపు సమయాన భద్రత, కేంద్రాల్లో ప్రథమ చికిత్స, అవసరమైన రూట్లలో బస్సుల ఏర్పాటు, విద్యుత్, తాగునీటి వసతులప అదనపు కలెక్టర్ సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ వై.లక్ష్మీప్రసాద్, డీఎంహెచ్ఓ రామారావు, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, విద్యాశాఖ ఏడీ చావా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐ సదస్సులో
వైరా వాసికి ప్రశంసలు
వైరా: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన భారత్ బోధన్ ఏఐ కాన్క్లేవ్ లో వైరాకు చెందిన యువ శాస్త్రవేత్త, ఎంఎంకే ఏఐ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ ముగ్గు మురళీకృష్ణ పాల్గొన్నారు. రోబోటిక్ ఏఐ విద్యను ప్రాంత విద్యార్థులకు చేరవేయాలనే సంకల్పంతో ఆయన రూపొందించిన ఎంవీఆర్ కరిక్యులమ్కు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ డాక్టర్ వి.రామకోటి తదితరుల నుంచి ప్రశంసలు దక్కాయి. గ్రామీణ విద్యార్థులు రోబోటిక్స్, ఏఐ రంగంలో రాణించేలా ఈ కరిక్యులమ్ ఉపయోగపడుతుందని పలువురు అభినందించి మురళీకష్ణకు పురస్కారం అందజేశారు.
రేక్పాయింట్కు 2,677 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు సోమవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 2,677.41 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,277.41 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు ఏఓ(టెక్నికల్) పవన్కుమార్ తెలిపారు. అంతేకాక మహబూబాబాద్ జిల్లాకు 400 మె.టన్నులు కేటాయించి బఫర్ స్టాక్గా 200 మె.టన్నులు నిల్వ చేశామని వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి
పోలీసు క్రీడల్లో ప్రతిభ
ఖమ్మంక్రైం: ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చూపిన జిల్లా ఉద్యోగులను సీపీ సునీల్దత్ సోమవారం అభినందించారు. రాష్ట్రస్థాయిలో పోటీలకు జిల్లా నుంచి హాజరైన వారు 156 బంగారు పతకాలు, ఎనిమిది రజత, 16 కాంస్య పతకాలు సాధించడంపై అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు సుశీల్సింగ్, నర్సయ్య, ఆర్ఐలు సాంబశివరావు, సురేష్ క్లూస్టీం సీఐ నరేష్ పాల్గోన్నారు.
ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు


