అత్యధిక కేసుల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అత్యధిక కేసుల పరిష్కారమే లక్ష్యం

Nov 5 2025 8:07 AM | Updated on Nov 5 2025 8:07 AM

అత్యధిక కేసుల  పరిష్కారమే లక్ష్యం

అత్యధిక కేసుల పరిష్కారమే లక్ష్యం

ఖమ్మం లీగల్‌: జిల్లా కోర్టుల్లో ఈనెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ తెలిపారు. జిల్లా కోర్టులో మంగళవారం ఆయన పోలీసు అధికారులు, బ్యాంకర్లు, చిట్‌ ఫండ్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎక్కువ కేసులను పరిష్కరించేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాజీ పడదగిన సివిల్‌, క్రిమినల్‌ కేసులే కాకుండా బ్యాంకులు, సైబర్‌ కేసులపై శ్రద్ధ కనబరచాలని తెలిపారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

నేడు ఖమ్మం మార్కెట్‌కు సెలవు

రేపు పత్తి కొనుగోళ్లకు బ్రేక్‌

ఖమ్మంవ్యవసాయం: కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి సందర్బంగా బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. అలాగే, సమస్యల పరిష్కారం కోసం కాటన్‌ అసోసియేషన్‌ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గురువారం పత్తి కొనుగోళ్లు మాత్రమే నిలిచిపోతాయని, మిర్చి, అపరాలు, ఇతర పంటల కొనుగోళ్లు యదాతథంగా ఉంటాయని మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

మధిర: మధిర వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయని మార్కెట్‌ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌ తెలిపారు. ఈనెల 5న బుధవారం కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి సందర్భంగా సెలవు ఇవ్వగా, గురువారం పత్తి కొనుగోళ్లకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు.

నిరుద్యోగులకు ‘డీట్‌’ యాప్‌ ద్వారా ఉద్యోగాలు

భద్రాచలంటౌన్‌: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం డీఈఈటీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. నిరుద్యోగులు ప్లే స్టోర్‌ ద్వారా డీఈఈటీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని జేఎస్‌బీసీఎం రిఫరల్‌ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ యాప్‌ ద్వారా దాదాపు 900 కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నందున నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమా చారం కోసం ఐటీడీఏ కార్యాలయంలోని భవిత సెల్‌లో సంప్రదించాలని పీఓ వివరించారు.

9న సీనియర్‌ వాలీబాల్‌ జట్ల ఎంపిక

ఖమ్మం స్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్‌ సీనియర్‌ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి బి.గోవిందారెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్‌ కార్డుతో ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంకు రావా లని సూచించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులతో జిల్లా జట్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. వివరాలకు 99121 65446 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

సాధారణ ప్రసవాల

సంఖ్య పెరగాలి

సత్తుపల్లిరూరల్‌/తల్లాడ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పుల సంఖ్య మరింతగా పెరగాలని జిల్లా ఎన్‌సీడీ ప్రొగ్రాం అధికారి డాక్టర్‌ డి.రామారావు సూచించారు. సత్తుపల్లిలో మంగళవారం వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశారు. శస్త్రచికిత్సలు కాకుండాసాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అలాగే, టీబీ ముక్త్‌భారత్‌పై ప్రజలోఅవగాహన కల్పించాలని చెప్పారు. కాగా, బాలికల్లో కనీస శారీరక వ్యాయామం లేకపోవడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నందున అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కాగా,తల్లాడలో శ్రీ సాయి బాలాజీ నర్సింగ్‌ హోమ్‌ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతోందని ఫిర్యాదులు రావడంతో డాక్టర్‌ రామారావు తనిఖీ చేశారు. ఆస్పత్రి సర్టిఫికెట్లను పరిశీలించాక డాక్టర్‌ అశోక్‌కుమార్‌ నుంచివివరాలు సేకరించారు. వైద్యాధికారులు అవినాష్‌, మహేష్‌, ఉద్యగులు వేణుగోపాల్‌, దుర్గయ్య, రామారావు, కె.పెద్దపుల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement