
జిల్లా విద్య, శిక్షణ సంస్థ
ఖమ్మం సహకారనగర్ : కేంద్ర ప్రభుత్వం తొలివిడతలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఎంపిక చేసిన కళాశాలల్లో ఖమ్మంలోని డైట్ కళాశాలకు స్థానం దక్కింది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర వసతులు కల్పించాలనే లక్ష్యంతో డైట్ కళాశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఎంపిక కావడంతో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా ఐదు కొత్త కోర్సులతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.8 కోట్ల నిధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులతో కళాశాలలో అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. సుమారు 350 మంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మించనున్నారు. డిజిటల్ సదుపాయాలతో కూడిన సెమినార్ హాళ్లు, లెక్చర్ హాళ్లు, సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, మ్యాథ్స్, ఇంగ్లిష్, తెలుగు ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ, సోలార్ ప్యానెళ్ల వంటివి అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ మాట్లాడుతూ..సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు ఎంపిక కావడంతో కళాశాలకు మహర్దశ పట్టనుందని తెలిపారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా కళాశాల ఎంపిక