బళ్లారి అర్బన్: విద్యార్థుల జీవితంలో ఆరోగ్యం, క్రీడాస్ఫూర్తి కీలక పాత్ర పోషిస్తాయి. శారీరకంగా ధృడంగా ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నగరంలోని శ్రీమతి సరళాదేవి సతీష్చంద్ర అగర్వాల్ ప్రభుత్వ ఫస్ట్గ్రేడ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ప్రహ్లాద చౌదరి తెలిపారు. కళాశాల వార్షికోత్సవంలో భాగంగా షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా నిర్వహించిన సింగిల్స్, డబుల్స్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. కార్యక్రమంలో కన్నడ శాఖ సహాయక ఆచార్యుడు రామస్వామి, అధ్యాపకుడు చంద్రశేఖర్, జర్నలిజం శాఖ అధ్యాపకుడు డాక్టర్ గిరీష్ కుమార్, అధ్యాపకులు సంతోష్ కుమార్ చౌహాన్, శంభులింగయ్య స్వామి, సిబ్బంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


