రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాయచూరు వాణిజోద్యమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా అధికారి పూవితను కలసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు కమల్ కుమార్ మాట్లాడుతూ.. రాయచూరులో విమానాశ్రయం, రహదారి, మోగా పార్కు, కృష్ణా వంతెన నిర్మాణం తదితర పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని కోరారు. రైల్వే గూడ్స్షెడ్ స్థలాంతరం, పరిశ్రమల స్థాపనకు భూముల సేకరణ, మెగా జౌళి పార్కు, పక్షిదామ కేంద్రం, సింధనూర్–రాయచూరు రైల్వే పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జంబన్న, ఎంఎన్ మూర్తి, పురుషోత్తమ్, వెంకటరాజ్ గుప్తా, వసంత్ రావు, మురారిలాల్, నారాయణ రావ్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీకి జరిమానా
హుబ్లీ: కుమారుడి బీమా సొమ్ము చెల్లించని హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి జిల్లా వినియోగదారుల ఫోరం జరిమానాతో పాటు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. హుబ్లీ గంగాధర నగర పద్మవ్వ గురాల కుమారుడు సునీల్ సదరు బీమా కంపెనీలో రూ.1.96 లక్షలు చెల్లించి బీమా చేయించాడు. పాలసీ రన్నింగ్లో ఉండగానే సునీల్ గుండెపోటుతో మరణించాడు. పాలసీ డెత్ రిస్క్ కలిగి ఉంది. పాలసీ నియమాల ప్రకారం తన కుమారుడు మరణాంతరం బీమా సొమ్ము రూ.27.44 లక్షలు చెల్లించాలని తల్లి పద్మవ్వ కంపెనీని కోరింది. అయితే ఆ కంపెనీ నియమాలు ఉల్లంఘించి, బీమా సొమ్ము చెల్లించడంలో జాప్యం చేసింది. బాధితులు వెంటనే జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు, సభ్యులు కేసు విచారణ చేపట్టారు. బీమా రూ.27.44 లక్షలను ఆదేశం ఇచ్చిన రోజు నుంచి ఒక నెలలోపు చెల్లించాలన్నారు. అలాగే ఇబ్బంది, మనోవేదనకు రూ.50 వేలు పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించారు.
నీటి పొదుపు పాటించండి
కేజీఎఫ్: తాలూకాలోని కమ్మసంద్ర గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం తాగునీటి అదాలత్ను శుక్రవారం నిర్వహించారు. పాలనాధికారి తిరుమూర్తి నాయక్ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఏర్పడితే వెంటనే గ్రామ పంచాయతీ సహాయవాణికి సమాచారం అందించాలని తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారి వసంతకుమార్ మాట్లాడుతూ బోరు బావి చుట్టూ స్వచ్ఛతను కాపాడుకోవాలన్నారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు.
పట్టపగలే దోపిడీకి యత్నం
కోలారు: నగదు సంచిని దోపిడీ చేసేందుకు యత్నించిన దొంగను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈఘటన బేతమంగల గ్రామంలో చోటు చేసుకుంది. కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రమేష్.. కెనెరా బ్యాంకు నుంచి రూ. లక్ష డ్రా చేసుకుని డబ్బును స్కూటర్లో ఉంచుకుని బయల్దేరాడు. వెంబడించిన నలుగురు దొంగలు బస్టాండు సమీపంలో అడ్డగించి బెదిరించి నగదును దోచుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో స్థానికులు అడ్డుకున్నారు ముగ్గురు పరారు కాగా మరో వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.


