బొజ్జ గణపతికి వెన్నాభిషేకం
శ్రీనివాసపురం: ముళబాగిలు తాలూకాలోని కురుడుమలై గ్రామంలో వెలసిన పురాణ ప్రసిద్ధ వినాయక దేవాలయంలో స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెలవు దినం కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పంచామృత అభిషేకం తరువాత అర్చకులు వినాయక దీక్షిత్ ఆధ్వర్యంలో 15 అడుగుల ఎత్తైన ఏకదంతుని విగ్రహాన్ని వెన్నతో అలంకరించి పూజలు చేపట్టారు.
లాల్బాగ్లో 5వ గేటు!
● ప్రజల అసంతృప్తి
బనశంకరి: ఉద్యాననగరిలో ప్రసిద్ధ లాల్బాగ్ పార్క్లో నాలుగు ప్రవేశద్వారాలు ఉండగా,
క్యాంటీన్ సమీపంలో మరో కొత్త గేట్ నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఉన్న 4 గేట్ల నుంచి ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. లాల్బాగ్ చుట్టు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు కార్లు, ఇతర వాహనాలను త్వరగా వెళ్లి రావడానికి 5వ గేటు అవసరమని ఉద్యానవనశాఖ తెలిపింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన వాకర్లు, పరిసర ప్రేమికులు.. ఇప్పుడు ఉన్న గేట్లు చాలని, కొత్త గేటు వల్ల గందరగోళం ఏర్పడుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం ఊరుకుంటుందా, 5వ గేటును నిర్మిస్తుందా? అనేది చూడాలి.
గజ దాడిలో
పీయూసీ విద్యార్థిని బలి
దొడ్డబళ్లాపురం: శనివారం ఆరంభమైన ద్వితీయ పీయూసీ (ఇంటర్) పరీక్షలను రాసి వస్తుండగా ఏనుగు దాడి చేయడంతో పూజా (17) అనే విద్యార్థిని మరణించింది. ఈ సంఘటన మడికెరి తాలూకా బెట్టత్తూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. బెట్టత్తూరు గ్రామం అడవికి దగ్గరగా ఉంటుంది. గ్రామ నివాసి పూజా మడికెరిలో ఇంటర్ పరీక్ష రాసి సాయంత్రం 5:30 సమయంలో బస్సు దిగి ఇంటికి నడిచి వెళ్తోంది. ఇంకొంచెం సేపట్లో ఇంటికి చేరుకోనుండగా, ఎక్కడి నుంచో ఓ అడవి ఏనుగు బాలికను వెంటాడి తొండంతో కొట్టి చంపింది. దీంతో గ్రామస్తులు బాలిక శవంతో ఆందోళనకు దిగారు. ఏనుగుల నివారణకు అటవీ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదంటూ, అందుకే ఓ ప్రాణం బలైందని దుయ్యబట్టారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు గ్రామానికి వచ్చి ప్రజలకు నచ్చజెప్పి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
స్విఫ్ట్ సిటీకి భూములు ఇవ్వం
● సర్జాపురలో రైతుల నిరసన
బొమ్మనహళ్ళి: బెంగళూరు శివార్లలో ఆనేకల్ వద్ద సర్జాపుర రైతులు కేఐఎడీబీ భూసేకరణ కోసం సమాచార నోటీసు అందించడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. నోటీసును రైతులు తిరస్కరించారు. కేఐఎడీబీ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పగలు–రాత్రి నిరసన 260 రోజులు పూర్తి చేసుకుంది. వందలాది మంది రైతులు, మహిళలు నిరసనలో పాల్గొన్నారు. సర్జాపుర హోబ్లిలో ప్రభుత్వ స్విఫ్ట్ సిటీ నిర్మాణం కోసం 2,451 ఎకరాల భూమిని సేకరించడానికి కేఐఎడీబి సన్నాహాలు చేస్తోంది. కానీ తమ పొలాలను లాక్కుని బజారున పడేయవద్దని రైతులు కోరుతున్నారు. శనివారం సాయంత్రం నోటీసు అందించడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. పొలాలు, తోటలతో జీవనం సాగిస్తుంటే బంజరు భూమి అని నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. గొడవలు జరగకుండా ఏఎస్పీలు వెంకటేష్ ప్రసన్న, నాగరాజు బందోబస్తు నిర్వహించారు.
బొజ్జ గణపతికి వెన్నాభిషేకం
బొజ్జ గణపతికి వెన్నాభిషేకం
బొజ్జ గణపతికి వెన్నాభిషేకం


