మోసగాడికి చుక్కెదురు
బనశంకరి: తన అంశాలను దాచి పెట్టి పెళ్లికి సిద్దమైన వరుడికి చుక్కెదురైంది. అతని మోసాలను తెలుసుకున్న వధువు పెళ్లికి నిరాకరించింది. దీంతో వివాహం ఆగిపోయిన ఘటన చిక్మగళూరు జిల్లా శృంగేరిలో శుక్రవారం చోటు చేసుకుంది. శృంగేరి పట్టణంలోని ఈడిగ సముదాయ భవనంలో శుక్రవారం 41 ఏళ్ల దీక్షిత్హెగ్డే, 29 ఏళ్ల సుష్మా వివాహానికి ఏర్పాట్లు చేశారు. దీక్షిత్హెగ్డేకు ఇది మొదటి వివాహం కాగా, సుష్మాకు రెండో వివాహం. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. తన కుమారుడికి తండ్రి స్థానం అందిస్తారని, తనకు ఆసరాగా ఉంటారని సుష్మా ఈ వివాహానికి సమ్మతించింది. వివాహ సంబరాల్లో ఉన్న సుష్మాకు అజ్ఞాత వ్యక్తి నుంచి లేఖ అందింది. ఆ లేఖలో వరుడు దీక్షిత్హెగ్డే గురించి దిగ్భ్రాంతికర విషయాలు ఉండగా, వాటిపై సుష్మా అతడిని ప్రశ్నించగా, ఏం అడిగినా తర్వాత చెబుతానని దాటవేశాడు. కోపోద్రిక్తురాలైన సుష్మా వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. సుష్మా ఆరోపణల ప్రకారం దీక్షిత్హెగ్డే తన వయస్సు గురించి అబద్ధం చెప్పాడు. అంతేగాక అతడిపై ఉన్న పోలీసు కేసుల గురించి దాచిపెట్టాడు. 2021లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దీక్షిత్హెగ్డే నిందితునిగా ఉన్నాడు. కళ్యాణ మంటపంలో హైడ్రామా ప్రారంభం కాగానే సీడీపీఓ అధికారులు, శృంగేరి పోలీసులు చేరుకున్నారు. యువతిని రాజీ ద్వారా నచ్చజెప్పడానికి యత్నించగా నమ్మకద్రోహం చేసిన వ్యక్తితో తాను జీవితం పంచుకోలేనని చెప్పి సుష్మా కళ్యాణమంటపం నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై శృంగేరి స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి నిరాకరించిన వధువు
ఆగిపోయిన వివాహ వేడుక


