రాజధానిలో విదేశీయులపై డేగకన్ను
బనశంకరి: అక్రమంగా బంగ్లాదేశీలు సహా విదేశీ పౌరులు రాజధానిలో మకాం వేశారని ఆరోపణలు వెల్లువెత్తడంతో నగర పోలీసులు తనిఖీలను తీవ్రం చేశారు. నగర తూర్పు విభాగంలో రామమూర్తినగర ఠాణా పరిధిలో కే.చన్నసంద్ర, కల్కెరె ప్రదేశాల్లోని వివిధ ప్లైవుడ్ దుకాణాలు, గోదాములు, అలాగే ఇళ్లలో పనిచేసే కార్మికులను కనిపెట్టి వారి ఊరు, పేరు వివరాలను సేకరించారు. వెయ్యిమందికి పైగా అనుమానిత వ్యక్తుల ఆధార్కార్డు, మార్కు షీట్లు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్, మొబైల్ ఫోన్ కాల్స్, వాట్సాప్ గ్రూప్లను తనిఖీ చేశారు. ఓ విదేశీయునితో పాటు 11 మంది అక్రమ నివాసుల ఆచూకీ కనిపెట్టినట్లు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్సింగ్ తెలిపారు.
సమాచారం అందించండి: కమిషనర్
తమ ఇళ్లలో బాడుగకు ఉండే విదేశీయులు గురించి స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని ఇళ్ల యజమానులకు కమిషనర్ సీమంత్కుమార్సింగ్ సూచించారు. నగరమంతటా విదేశీయుల పత్రాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల యజమానులు తమ వద్ద బాడుగకు ఉండే విదేశీ పౌరుల ఫారం–సీ సమాచారం స్థానిక ఠాణాలో అందజేయాలని కోరారు. అక్రమ, వీసా ముగిసిన, సరైన రికార్డులు లేని విదేశీయులను కనిపెట్టి, వారి దేశాలకు పంపిస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడేవారి ఆటకట్టిస్తామని, నగర ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
నగరమంతటా ముమ్మర తనిఖీలు


