చెరువుపాలైన ఇద్దరు బాలలు
దొడ్డబళ్లాపురం: ఈత కొట్టాలనే సరదా ఇద్దరు బాలల ప్రాణం తీసింది. బెంగళూరు ఉత్తర తాలూకా బ్యాత సీరేసంద్ర గ్రామంలోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిన మనోజ్ (9), మోహన్ (11) అనే బాలలు నీట మునిగి చనిపోయారు. ఆదివారం సెలవు కావడంతో ఇద్దరూ స్నేహితులతో కలిసి చెరువుకు వెళ్లారు. చెరువు మధ్యలో సుమారు 15 అడుగుల లోతు గుంత ఉండగా, ఆ గుంతలో పడిపోవడంతో బయటకు రాలేకపోయారు. కొంతసేపటికి స్థానికులు గాలించి బయటు తీసుకువచ్చేటప్పటికి మరణించారు.
నగదు దోపిడీ ముఠా అరెస్టు
దొడ్డబళ్లాపురం: అధికారులమంటూ రైడ్ పేరుతో రూ.24 లక్షలు దోచుకుని పరారైన 9 మంది దుండగులను దేవనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన దేవనహళ్లి తాలూకా ప్రసన్నహళ్లి రోడ్డులో జరిగింది. వివరాలు.. శంకరప్ప అనే వ్యక్తిని కృష్ణ అనే మోసగాడు డబ్బు ఇస్తే దానికి మూడు రెట్లు ఎక్కువ ఇస్తానని నమ్మించాడు. ఇది నమ్మిన శంకరప్ప ఇంట్లో ఉన్న బంగారు నగలు కుదువ పెట్టి రూ.24 లక్షలు తీసుకువచ్చాడు. కుట్ర ప్రకారం కృష్ణ స్నేహితులు ఏసీబీ, మానవహక్కుల సంఘం అధికారులమని కారులో వచ్చి శంకరప్పను బెదిరించి సీజ్ చేశామని చెప్పి రూ.24 లక్షలు తీసుకుని పరారయ్యారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి అసలు దొంగ కృష్ణ అని గుర్తించారు.అతడి ద్వారా మిగతా వారిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.
నగల చోరుల ముఠాకు సంకెళ్లు
తుమకూరు: జిల్లాలోని శిర తాలూకా కల్లంబెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బెంచే గేట్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలో చోరీ కేసులో దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ అశోక్ సోమవారం వివరాలను వెల్లడించారు. ఇటీవల నలుగురు దొంగలు షాపులోకి చొరబడి యజమాని దినేష్, నాతి దేవి కళ్ళల్లోకి కారం కొట్టి షాపు షట్టర్ను మూసివేశారు. బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించి, బొలెరో వాహనంలో పారిపోయారు. దర్యాప్తు జరిపి రాజస్థాన్లోని జలోర్ జిల్లాకు చెందిన అరవింద్ (28), దుంగర్ (24), మహేందర్ (32), మధు.సి (28)లను అరెస్టు చేశారు. వీరు కోలారు నగరంలో వివిధ పనులు చేసుకుంటూ దోపిడీలకు పాల్పడేవారని ఎస్పీ తెలిపారు. నగలు, బొలెరో జీప్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
హంప్స్ వద్ద స్కూటర్ పల్టీ.. యువతి మృతి
యశవంతపుర: స్కూటర్ నడుపుతున్న యువతి కింద పడి మృతి చెందిన ఘటన హాసన్ సమీపంలోని పారిశ్రామికవాడ వద్ద జరిగింది. సత్యమంగల లేఔట్కు చెందిన ప్రియా (23), స్నేహితురాలు స్వాతితో కలిసి స్కూటర్పై వెళ్తోంది, ఆ సమయంలో ఇద్దరూ హెల్మెట్ ధరించలేదు. రోడ్డుపై వేసిన హంప్స్ మీద నుంచి వేగంగా వెళ్లడంతో కింద పడ్డారు. గాయాలై ప్రియా అక్కడే చనిపోగా, స్వాతి గాయపడి ఆస్పత్రిలో చేరింది. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. హాసన్ గ్రామాంతర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు హంప్లు, మలుపుల వద్ద రంగులు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపించారు.
ఉసురు తీసిన నిరాదరణ
● వృద్ధ దంపతుల ఆత్మహత్య
యశవంతపుర: తమను చూసుకొనేవారు లేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హాసన్లో జరిగింది. కొడగు జిల్లా సోమవారపేట తాలూకా అరెహొసూరుకు చెందిన డేవిడ్ (80), మేరీ (73)లు హాసన్ దగ్గర రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. ఇళ్లు, భూములున్నాయి. కుమారులిద్దరూ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. వృద్ధాప్యంలో నిరాదరణకు గురై విరాజపేటలోని వృద్ధాశ్రమంలో ఉండేవారు. శనివారం రాత్రి సొంతూరికి వెళ్లొస్తామని బయల్దేరి హాసన్ కేంద్ర బస్టాండ్కు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు వారి కుటుంబీకులకు సమాచారం అందించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
చెరువుపాలైన ఇద్దరు బాలలు
చెరువుపాలైన ఇద్దరు బాలలు


