సాధ్విగా మారిన యువతి
సాక్షి, బళ్లారి: సంపన్న కుటుంబానికి చెందిన యువతి అన్నింటినీ త్యజించి సన్యాసినిగా దీక్ష స్వీకరించింది. యాదగిరి నగరంలో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా స్థిరపడిన మార్వాడీ కుటుంబానికి చెందిన నిఖిత (26) సన్యాస దీక్షను తీసుకుంది. ఈ సందర్భంగా నగరంలో వైభవంగా ఆమెను ఊరేగించారు. తరువాత జైన సన్యాసినులు ఆమెకు దీక్షను ఇచ్చారు. ఎన్నో కఠిన నియమాలతో కూడిన దీక్షను ఆచరించేందుకు కుమార్తెను తల్లిదండ్రులు కన్నీటితో సాగనంపారు.
ఈఎంఐ గొడవ..
బ్యాంకు ఉద్యోగిపై దాడి
బనశంకరి: రుణం కంతు చెల్లించాలని అడిగినందుకు బ్యాంకు సిబ్బంది మీద దౌర్జన్యం చేసిన ఘటన అన్నపూర్ణేశ్వరినగర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. నాగరబావి రెండోస్టేజ్ బీడీఏ కాంప్లెక్స్లో దాడి చోటుచేసుకుంది. వివరాలు.. బైక్ కొనడానికి ప్రైవేటు బ్యాంక్ ద్వారా రమేశ్ అనే వ్యక్తి రుణం తీసుకున్నాడు. గత రెండునెలలుగా రమేశ్ ఈఎంఐ కట్టలేదు. దీంతో సొమ్ము వసూలు చేయడానికి బ్యాంకు ఉద్యోగి బీఎం చందన్ వెళ్లాడు. వెంటనే పెండింగ్ సొమ్ములు కట్టాలని కోరగా గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన రమేశ్ నా ఇంటికే వచ్చి రగడ చేస్తావా అని రాయి తీసుకుని చందన్ మీద దాడి చేశాడు. బాధితుడు అన్నపూరేశ్వరినగర ఠాణాలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
నేడే వైరముడి సంభ్రమం
మండ్య: ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైరముడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. భక్తులకు స్వాగతం పలుకుతూ మండ్య తాలూకాలోని హోళలు గ్రామంలో కమాను నిర్మాణం చేశారు. నేడు సోమవారం మేలుకోటె కొండపై దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవం ఘనంగా జరుగుతుంది. జిల్లా ట్రెజరీలో భద్రపరచిన బంగారు, వజ్ర వైరముడి, రాజముడి అలంకారాలు, ఇతర ఆభరణాలను ఇదే మార్గంలో కొండ మీదకు తరలిస్తారు. ఇందుకు దేవాదాయ, పోలీసు సిబ్బంది సన్నాహాలు చేశారు.
భద్రా నిధులు ఇవ్వాలని కోరాం: డీకే
శివాజీనగర: రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఇతర రాష్ట్రాల ప్రతినిధులను పిలిపించి చర్చలు జరిపి, పరిష్కరిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి భరోసా ఇచ్చారని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఆదివారం సదాశివనగర తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన, భద్రా అప్పర్ ప్రాజెక్ట్కు గతంలో ప్రకటించిన రూ.5,300 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిమండలి ముందు ప్రవేశపెట్టినట్లు తెలిపారన్నారు. భద్రా అప్పర్ ప్రాజెక్ట్కు రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందో అన్ని నిధులు ఇవ్వాలని విన్నవించామన్నారు. మేకెదాటు, కళసా బండూరి, అప్పర్ భద్రా ప్రాజెక్ట్లు చాలా అవసరమని చెప్పామన్నారు.
అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం
తుమకూరు: హోం మంత్రి జీ.పరమేశ్వర్ సొంత జిల్లా తుమకూరులో వడ్డీ వ్యాపారుల వేధింపులకు సామాన్యుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... మండ్యకు చెందిన ముజీబ్ అనే పండ్ల వ్యాపారి ఇక్కడ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండ్యలో పండ్ల వ్యాపారం చేసే ముజీబ్ మీటర్ వడ్డీకి అప్పులు ఇచ్చే వారి నుంచి రూ.10 లక్షల వరకూ అప్పులు చేశాడు. సకాలంలో వాయిదాలు కట్టకపోవడంతో రుణదాతలు వేధించసాగారు. దీంతో తుమకూరుకు వచ్చాడు. సెల్ఫీ వీడియోలో బాధలు చెప్పుకుని పురుగుల మందును తాగాడు. సురేష్, చన్నెగౌడ, రాజన్న అనేవారు సతాయిస్తున్నారని, తన మరణానికి వారే కారణమని చెప్పాడు. అతన్ని జిల్లా ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
సాధ్విగా మారిన యువతి
సాధ్విగా మారిన యువతి


