కరీంనగర్ టౌన్: ‘ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు.. సర్కారే ఇస్తుందని కదా అని ఇంట్లో తల్లిదండ్రులు.. అయోమయంలో మా చదువులు.. ఎవరికి చెప్పుకున్నా జరగని న్యాయం.. ఎన్నిసార్లు ఆందోళనకు దిగినా పట్టించుకోని ప్రభుత్వం.. వెరసి తప్పనిసరి పరిస్థితిల్లో మరోసారి మేం రోడ్డెక్కాం.. స్కాలర్షిప్ సర్కా రు వేసే బిక్షకాదు.. మా హక్కుగా పోరాడుతున్నాం’.. అంటూ నగరంలో మంగళవారం విద్యార్థులు కదం తొక్కారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది కలెక్టరేట్కు చేరుకుని ముట్టడికి యత్నించారు. ప్రభుత్వం స్కాలర్షిప్ పెండింగ్ నిధులు విడుదల చేయాలని నినదించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న రూ.12వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అనంతరం కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు ఆరెస్టు చేశారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్, బి.రాజ్, మల్యాల రాకేశ్, పూసాల విష్ణు, యోగేష్, బామాండ్ల నందు పాల్గొన్నారు.


