కరీంనగర్సిటీ: విద్యార్థులు నాణ్యమైన పరిశోధనలపై దృష్టి పెట్టాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి.సతీశ్ కుమార్ పేర్కొన్నారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ అటనామస్ కళాశాల కామర్స్ విభాగం వారు శాతవాహన యూనివర్సిటీ ‘అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం’లో భాగంగా యూనివర్సిటీ కామర్స్ విభాగం సహకారంతో పరిశోధన పద్ధతులపై ఏర్పాటు చేసిన రెండు రోజుల కార్యశాల ఘనంగా ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ పి.సతీశ్ కుమార్ మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనల ద్వారానే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కళాశాల కామర్స్ విభాగాధిపతి రాజయ్య మాట్లాడుతూ పరిశోధన పద్ధతులు అనే అంశం పీహెచ్డీ, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉపయోగకరమని తెలిపారు. కార్యశాల సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పరిశోధన పద్ధతులపై అవగాహన కల్పించడమే వర్క్షాప్ ఉద్దేశం అన్నారు. డాక్టర్ డి.వెంకట్రావు వివిధ గణాంక శాస్త్ర పద్ధతుల గురించి వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, టి.రాజయ్య, కడారు సురేందర్రెడ్డి, డి.హరికాంత్ పాల్గొన్నారు.


