కరీంనగర్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణకు అవగాహన, సరైన సమాచారమే ప్రధాన ఆయుధాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రాజగోపాల్ అన్నారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్–2026’లో భాగంగా బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చేపట్టిన బైక్ ర్యాలీని డాక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాప్తి మార్గాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, హెచ్ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష చూపకుండా అండగా నిలవాలని ఆయన సూచించారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా హెచ్ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్స, అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ‘బీ పాజిటివ్ టు ప్రివెంట్ హెచ్ఐవీ పాజిటివ్’ సందేశంతో జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ర్యాలీలో అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ సుధ, పీవో–ఎంహెచ్ఎన్ డాక్టర్ సనా, ఏవో రాజగోపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి రాజగోపాల్
కరీంనగర్లో భారీ బైక్ ర్యాలీ


