ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆర్థిక సాయం చేసి పతిభిక్ష పెట్టాలని ఓ ఇల్లాలు వేడుకుంటుంది. అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన తన భర్తను ప్రాణాలు నిలబెట్టాలని అర్థిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఎనగందుల తిరుపతి(34) కేసీఆర్ కాలనీలో ఉంటున్నాడు. బతుకుదెరువు కోసం గతంలో దుబాయ్, మలేషియా వెళ్లి వచ్చాడు. గల్ఫ్లో ఉండగానే అనా రోగ్యానికి గురికావడంతో అప్పులు తీరకుండానే స్వగ్రామానికి చేరాడు. ఇటీవల అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో చూపించగా ప్రాంక్యియాసిస్గా వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడి నుంచి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. తిరుపతికి రక్తం తక్కువ ఉందని బ్లడ్ప్యాకెట్లు ఎక్కించాలని వైద్యులు సూచించారు. ఒక్కో బ్లడ్ ప్యాకెట్కు రూ.2వేల చొప్పున కొనుగోలు చేసి ఎక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రస్తుతం శస్త్రచికిత్సకు రూ.20లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో చేతిలో చిల్లి గవ్వలేక భర్తను బతికించుకోవడానికి భార్య శ్యామల పడుతున్న వేదన వర్ణనాతీతం. దాతలు స్పందించి తన భర్తను బతికించాలని శ్యా మల, కూతుళ్లు సింధు, తను, కుమారుడు సుచిత్ కోరుతున్నారు. దాతలు 7893969976లో సంప్రదించాలని వేడుకుంటున్నారు.
భర్త అనారోగ్యంతో ఆస్పత్రిపాలు
ఆదుకోవాలని వేడుకుంటున్న ఇల్లాలు


