ధర్మపురి: ధర్మపురిలోని హనుమాన్వాడకు చెందిన రాపర్తి లక్ష్మి ఇంటిలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ కేసులో మైనర్ బాలుడిని అరెస్టు చేసి ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. గురువారం ధర్మపురి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. రాపర్తి లక్ష్మి ఇంట్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రెండు తులాల బంగారం, పది తులాల వెండి గొలుసులు దొంగిలించారని బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. ఎస్పీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి పర్యవేక్షణలో సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై మహేశ్లు కేసును సవాల్గా తీసుకొని తమ సిబ్బందితో సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు పరిశీలించి ఇతర సమాచారాన్ని సేకరించి చోరీకి పాల్పడిన మైనర్ బాలుడిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు మైనర్ అయినందున చట్టపరమైన నిబంధనల మేరకు అతని పేరు, ఫొటో వెల్లడించలేదని అన్నారు. నిందితుడి నుంచి 2తులాల బంగారం, 14 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గతంలో చోరీ చేసిన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా చోరీ కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులను ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు.
ఆభరణాలు, మోటార్ సైకిల్ స్వాధీనం


