కరీంనగర్ అర్బన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణాంకశాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కొనసాగుతోంది. జాతీయ గణాంక శాఖ 2026 సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులను నమోదు చేస్తున్నారు. గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో సర్వే చేస్తుండగా ప్రజల జీవన స్థితిగతులను నివేదించనున్నారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు, సభ్యులు, విద్యార్హతలు, చదువు మానేసిన, ఉన్నత చదువులు, వృత్తివిద్యా కోర్సులు, ఉద్యోగం, సరోజువారీ కూలీ అయితే వారంలో ఏ పని చేశారో, వేతన వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వారయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని తెలిపారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సర్వే జరగగా కార్పొరేటర్ గంట శ్రీనివాస్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ నాగారపు హరికృష్ణ, మున్సిపల్ మెప్మా సెక్షన్ సిబ్బంది ఆర్పీలు రమ్య, కల్పన, మున్సిపల్ సిబ్బంది తంగళ్లపల్లి కల్యాణ్ పాల్గొన్నారు.
ఎస్సీసెల్ పరిశీలకుడిగా అరుణ్కుమార్
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ఎస్సీసెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడిగా కరీంనగర్కు చెందిన కొరివి అరుణ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీచేశారు. పీసీసీ ఎస్సీసెల్ చైర్మన్గా కవ్వంపల్లి నియామకం తర్వాత, నూతన కమిటీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే పాత కమిటీలన్నింటిని రద్దు చేశారు. కొత్త కమిటీల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిశీలకుడిగా కరీంనగర్ జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు అరుణ్కుమార్ను నియమించారు. అరుణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షుల అనుమతితో స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమావేశాల ద్వారా ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం నివేదికను కవ్వంపల్లికి అందించనున్నారు.


