మాయామురళి..సాహసికుడు | - | Sakshi
Sakshi News home page

మాయామురళి..సాహసికుడు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

చాలాకాలం క్రితం నీలగిరి పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆర్యన్‌ అనే ఒక ధైర్యవంతుడైన యువకుడు ఉండేవాడు. ఆ గ్రామానికి దగ్గర్లో చీకటి అడవి ఉండేది. ఆ అడవిలోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రారని అక్కడి ప్రజలు నమ్మేవారు. ఒకరోజు గ్రామంలోని పంటలన్నీ ఎండిపోయి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు ఒక ముసలితాత ‘అడవి మధ్యలో ఒక మాయా మురళి ఉంది. దానిని ఊదితే వానలు కురుస్తాయి..నేల పచ్చబడుతుంది’ అని చెప్పాడు.

సాహసం ప్రారంభం

గ్రామస్తుల కష్టాలను చూడలేక ఆర్యన్‌ ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు. అడవిలో వింతవింత శబ్దాలు.. దట్టమైన పొగమంచు అతన్ని భయపెట్టాయి. కానీ... ఆర్యన్‌ వెనకడుగు వేయలేదు. దారిలో అతనికి ఒక గాయపడిన పక్షి కనిపించింది. ఆర్యన్‌ దానికి చికిత్సచేసి, తన దగ్గర ఉన్న నీటిని తాగించాడు. ఆ పక్షి ఒక అడవి దేవతగామారి, ‘నీ దయాగుణానికి మెచ్చాను. ఈ దారిలో వెళ్తే నీకు మురళి కనిపిస్తుంది. కానీ.. దాన్ని పొందే ముందు నువ్వు నీ అహాన్ని వదులుకోవాలి’ అని చెప్పి మాయమైపోయింది.

ముగింపు

చివరికి ఆర్యన్‌ ఒక పెద్ద గుహలోకి చేరుకున్నాడు. అక్కడ బంగారంలా మెరుస్తున్న మురళి ఉంది. దాన్ని తాకగానే, ఒక గంభీరమైన స్వరం వినిపించింది: ‘దీన్ని నువ్వు నీ స్వార్థం కోసం వాడుకుంటావా? లేక ఇతరుల కోసమా?’ అని శబ్ధం వచ్చింది. ఆర్యన్‌ ఏమాత్రం ఆలోచించకుండా, ‘నా గ్రామం క్షేమం కోసమే నాకు ఇది కావాలి’ అని సమాధానమిచ్చాడు. అతని నిస్వార్థానికి మెచ్చి ఆ మురళి ఆర్యన్‌ చేతికి చిక్కింది. అతను గ్రామానికి వచ్చి మురళిని ఊదగానే, ఆకాశం నుంచి వర్షం కురిసి గ్రామం మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. ఆర్యన్‌ అందరికి హీరో అయ్యాడు.

నీతి: నిస్వార్థమైన మనసుతో చేసే ఏ ప్రయత్నమైనా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది.

మనన్‌, బాలరచయిత

4వ తరగతి

మండల పరిషత్‌

ప్రాథమిక పాఠశాల,

గ్రామం: రాచ్‌పల్లి,

మండలం: ధర్మారం

జిల్లా: పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement