కరీంనగర్: కరీంనగర్లోని రెనే హాస్పిటల్, శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోకాలి కీళ్ల మార్పిడి శిబిరం విజయవంతమైంది. ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ బంగారి రజని ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఎంపికై న 18 మంది లబ్ధిదారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, వారిని ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ చేశారు. ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని ఈసారి ఆరోసారి నిర్వహించారు. మార్చి 2026లో జరిగిన మెడికల్ క్యాంపుకు హాజరైన సుమారు 600 మంది పేషెంట్లలో నుంచి లక్కీ డ్రా విధానం ద్వారా 18 మందిని ఎంపిక చేసి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు. వీరిలో 8 మందికి అత్యాధునిక జాన్సన్ అండ్ జాన్సన్ రోబోటిక్ సాంకేతికతతో కీళ్ల మార్పిడి చేయగా.. మిగతావారికి సాధారణ పద్ధతిలో చికిత్స అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. సుమారు రూ.40లక్షల విలువైన వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఆధునిక రోబోటిక్ వైద్యసేవలను జిల్లాకు తీసుకురావడమే కాకుండా పేదలకు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ... తన తల్లిదండ్రుల స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రెనీ హాస్పిటల్ వైద్యులు మునిష్, కృష్ణారెడ్డి, లతీశ్రెడ్డి, సురేశ్కుమార్, సుధీర్ ద్వారాక్ నాయుడు, నిఖిల్ లక్ష్మణ్, విశాల్, వైభవ్, కమలుద్దీన్, పులి స్ఫూర్తి, నవ్య, సారా ఫాతిమా, ఆదిత్య, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
18 మందికి ఆపరేషన్లు చేసిన డాక్టర్ బంగారి స్వామి


