న్యూస్రీల్
వెదిరలో రాస్తారోకో చేస్తున్న రైతులు
శంకరపట్నం మండలం కరీంపేటలో తడిసిన ధాన్యం
హుజూరాబాద్ మండలంలో తడిసిన ధాన్యం
వెదిరలో రాస్తారోకోలో చిక్కుకున్న 108 వాహనం
రామడుగు/శంకరపట్నం/హుజూరాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు ధాన్యం విక్రయించుకునేందుకు తిప్పలు తప్పడం లేదు. కల్లాల్లోని ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహానికి గురవుతుండగా, పలుచోట్ల అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. ఎటుతిరిగీ అన్నదాతే నష్టపోతుండగా.. కొనుగోళ్లు వేగిరం చేయాల్సిన అవసరం ఉంది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం లేదని, వేసిన ధాన్యానికి 4కిలోల తరుగు తీస్తున్నారని కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపైన వెదిరలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపుగా గంటపాటు ఆందోళన చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంగాధర ఎస్సై వంశీకృష్ణ రైతులకు నచ్చజెప్పి అందోళన విరమింప జేసే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు. తహసీల్దార్ రాజేశ్వరి వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్యను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. శంకరపట్నం మండలంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కరీంపేట, కొత్తగట్టు, మొలంగూర్, మెట్పల్లిలో అకాలవర్షంతో సంచుల్లో కాంటా వేసిన ధాన్యంతో పాటు కుప్పలు తడిసిపోయాయి. హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్, సిర్సపల్లి, చెల్పూర్ గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొట్టుకు పోయింది.
అన్నదాత అరిగోస


