తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
జువెల్లరీ దోపిడీ ఘటనలో గాయపడిన బాధితులకు పరామర్శ
కరీంనగర్: దేశాన్ని ఉత్తరాది– దక్షిణాది పేరుతో విభజించాలనే ప్రయత్నాలు చేసిన వారికి ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గుణపాఠంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని అన్నారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ఆ పార్టీకి అధికారం దక్కిందని పేర్కొన్నారు. కరీంనగర్లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పీఎంజే జువెలర్స్ సిబ్బందిని సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ ఘటనను దారుణమైందన్నారు. ఇలాంటి సందర్భాల్లో బాధితులను పరామర్శించడం మానవత్వమని, బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ ఘటనకు తాను రాజీనామా చేయాలనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు పాల్గొన్నారు.


