కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ భద్రత వారోత్సవాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ తెలిపారు. గృహ వినియోగదారులు, రైతులు విద్యుత్తో జాగ్రత్త వహించాలని కోరారు. జీరో ప్రమాదాలే లక్ష్యంగా ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సర్కిల్వ్యాప్తంగా విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అడవి పందుల నుంచి పంట పొలాలను రక్షించడానికి కరెంట్ ఫెన్సింగ్ అమర్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నాసిరకం వైరింగ్, నాణ్యతలేని పరికరాలు, ఎర్తింగ్ లేకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.


