ధర్మపురి: మండలంలోని తిమ్మాపూర్కు చెందిన మెంగెని రాజ్కుమార్ (35) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్ ఇటీవల ఇల్లు కట్టుకొని అప్పుల పాలయ్యాడు. అప్పుల సమస్యలతో పాటు ఇంట్లో కుటుంబ కలహాలు మొదలవడంతో భరించలేక ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు సేవించాడు. కుటుంబసభ్యులు గమనించి 108కు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకొని..
మేడిపల్లి: ఇటీవల ప్రకటించిన పదోతరగతి ఫలితాల్లో తన తోటి విద్యార్థుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని ఆవేదనతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడ్యాడ్కి చెందిన నిమ్మల రక్షిత(15) ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. అయితే తన తోటి విద్యార్థుల కంటే మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ప్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి సుజాత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అత్తారింటి వేధింపులకు వివాహిత...
ఇల్లంతకుంట(మానకొండూర్): సంతానం కలగడం లేదని భర్త, అత్త, ఆడబిడ్డలు తరచూ వేధించడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై–2(ఆర్) లక్పతి తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లికి చెందిన ఎలుక మల్లేశంతో కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన బాలమణికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలగకపోవడంతో బాలమణి(35)ని భర్త మల్లేశం, ఆడబిడ్డలు, అత్తలు వేధించడంతో ఆదివారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలమణిని అంబులెన్స్లో కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలి తల్లి సామర్ల వినోద ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలమణి అంత్యక్రియలు తల్లిగారి గ్రామం కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో నిర్వహించారు. బాలమణి భర్త ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు.


