తిమ్మాపూర్: ప్రమాదవశాత్తు యువకుడు బావిలోపడి మృతి చెందిన ఘటన తిమ్మాపూర్లో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పొరండ్ల గ్రామానికి చెందిన బొజ్జ రాజ్కుమార్(32) డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం మిత్రుడితో కలిసి మానేరు జలాశయం వైపు వెళ్లాడు. సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ముఖం కడుక్కునేందుకు యత్నించాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. రాజ్ కుమార్కు ఈత రాకపోవడంతో తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజకుమార్కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజ్కుమార్ మృతికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంతాపం వ్యక్తం చేశారు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


