కొత్తపల్లి(కరీంనగర్): గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిఽశ్రమల అక్రమాలకు అడ్డుపడేలా లేదు. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో అనుమతి లేకుండా నడిపిస్తున్న క్షేత్ర, శ్రీఅంబిక, వి నాయక, శ్రీసాయి, శ్రీహర్ష, మహానంది గ్రానైట్ కటింగ్, పా లీషింగ్ పరిశ్రమలకు గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసింది. స్పందించిన శ్రీమహానంది పరిశ్రమ యజమాని డబ్బులు చెల్లించి, పంచాయతీ అనుమతి పొందినట్లు వెల్ల డైంది. క్షేత్ర, అంబిక, వినాయక, శ్రీసాయి, శ్రీహర్ష గ్రానైట్ పరిశ్రమల యజమానులు సమయం కోరినట్లు తెలిసింది. అంబిక గ్రానైట్ పరిశ్రమ యజమాని గ్రానైట్ కటింగ్, పాలీ షింగ్ అసోసియేషన్ ప్రతినిధిగా ఉండటం గమనార్హం. రాజ కీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ యూనిట్లకు గ్రామ పంచాయతీ ఝలక్ ఇచ్చింది. కంగుతిన్న యజమానులు పంచాయతీకి సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎలాగైనా నోటీసుల నుంచి తప్పించుకునేందుకు సమయం కావాలంటూ, సుడాకు చెల్లించామంటూ సాకులు చెబుతున్న గ్రానైట్ పరిశ్రమల యజమానులు గ్రామ పంచాయతీపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ యూనిట్లకు టీఎస్ ఐపాస్ నుంచి సాంకేతిక అనుమతులున్నట్లు చెబుతూ గత కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీ అనుమతులు పొందకుండా, పన్నులు చెల్లించకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. పంచాయతీకి రావల్సిన పన్నులను ఎగవేస్తూ గ్రానైట్ పరిశ్రమలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో స్లర్ (గ్రానైట్ వేస్ట్) పోస్తూ పర్యావరణానికి పాతరేస్తున్నాయి. గ్రానైట్ పరిశ్రమల అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు మామూలుగా తీసుకుంటుండంతో ఆడిందే ఆటగా మారింది.
తహసీల్దార్కు ఫిర్యాదు
ప్రభుత్వ భూముల్లో స్లర్ (గ్రానైట్ చూర్ణం) పోస్తున్న అంబికా, క్షేత్ర గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ యూనిట్లపై తహసీల్దార్కు పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఆసిఫ్నగర్ పంచాయతీ పరిధిలోని 278 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి డస్ట్ పోస్తున్న పరిశ్రమలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. ఇప్పటికై నా సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం కోరుతోంది.
ఆసిఫ్నగర్లో పర్యావరణాన్ని పరిరక్షించడమే ప్రధాన ఎజెండాగా సర్పంచ్, పాలకమండలి సభ్యులు ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ఎక్కడపడితే అక్కడ డస్ట్ను పోస్తూ గ్రానైట్ పరిశ్రమలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి పరిశ్రమలో శానిటేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ప్లాంటేషన్ కనిపించాలి. అలాలేని పరిశ్రమలను సీజ్ చేస్తాం. ప్రతి పరిశ్రమ పంచాయతీ అనుమతి తీసుకోవాలి. దుమ్మును నివారించాల్సిన అవసరముంది.
– రేవంత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, ఆసిఫ్నగర్


