మల్లాపూర్: దగ్ధమైన పంట
రాయికల్: మంటలు ఆర్పుతున్న హమాలీలు
మల్లాపూర్/రాయికల్: సమీప రైతులు చెత్తకు నిప్పటించగా.. ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిసిపడి మూడెకరాల మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మల్లాపూర్ మండలం రేగుంటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాలసాని రాజన్న కంకలను కుప్పగా పోశాడు. గురువారం తోటి రైతులు చెత్తను కాల్చేందుకు మంట పెట్టారు. దీంతో మంటలు ఎగిసిపడి రాజన్న మొక్కజొన్న చేనును చుట్టుముట్టాయి. బాధితుడు, రైతులు కలిసి మంటలను ఆర్పేశారు. అప్పటికే కంకులు కాలిపోయాయి. రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితడు వాపోయాడు. ఏఈవో వంశీ పంటను పరిశీలించారు.
రాయికల్లో తప్పిన ప్రమాదం
రాయికల్: మండలంలోని ఆల్యనాయక్ తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ధాన్యం రాశులను చుట్టుముట్టాయి. ఆ సమయంలో రైతులెవరూ లేకపోవడంతో హమాలీలే స్పందించి మంటలను ఆర్పేశారు. సకాలంలో స్పందించిన హమాలీలను సర్పంచ్ సంతోష్, తిరుమల్నాయక్, రైతులు అభినందించారు.


