కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్) కల్పించింది. ప్రస్తుత డిజిటలైజేషన్ నేపథ్యంలో రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యుత్ సంస్థ ప్రత్యేక యాప్ల ద్వారా బిల్లుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. గంటల తరబడి క్యూలైన్లో నిలబడి సమయాన్ని వృథా చేసుకోకుండా ఉండే పరిస్థితులకు స్వస్తి పలుకుతూ మొబైల్లోనే ప్రత్యేక యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సదవకాశాన్ని టీజీఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్ ఏర్పాటు చేసింది. ఈ విధమైన చెల్లింపుల ద్వారా సకాలంలో విద్యుత్ చెల్లింపులు చేపట్టడటంతో పాటు అనవసరంగా ఆఫీసు చుట్టూ తిరగడం తప్పనుంది. వేసవిలో తీవ్రమైన ఎండల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకుంటూ సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగితే సంస్థకు ఉపయోగకరంగా ఉండనుంది. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో 1,36,351 మంది వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులు చేయగా..2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,49,068 మంది చెల్లించినట్లు విద్యుత్ శాఖ గణాంకాల ద్వారా తెలిసింది. వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపుల వైపు దృష్టి సారించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఎండల నుంచి రక్షణ పొందండి
ప్రత్యేకంగా టీజీఎన్పీడీసీఎల్ యాప్
అదనంగా గూగుల్పే, ఫోన్పే, పేటీఎం యాప్లు


