కథలాపూర్: మండలంలోని గంభీర్పూర్, బొమ్మెన శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సోమవారం సాయంత్రం సీజ్ చేసినట్లు మైనింగ్ శాఖ ఏడీ జైసింగ్ తెలిపారు. వాగులో నుంచి ఇసుకను తీసి శివారులో డంప్ చేశారు. స్థానికులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక తనిఖీలు చేయగా.. ఇసుక డంపులు కనిపించగా సీజ్ చేసినట్లు జైసింగ్ తెలిపారు.
కొందరికి మినహాయింపుపై వివాదం
ఇసుక అక్రమ తరలింపు విషయంలో అధికారులు కొందరికి మినహాయింపు ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. వాగుల నుంచి పలుకుబడి గల వ్యక్తులు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుంటే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. కొత్తగా ఇసుక వ్యాపారం చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించడం వివాదాలకు దారి తీసిందని సమాచారం. ఈ క్రమంలోనే బొమ్మెన, గంభీర్పూర్ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపుల విషయంలో జిల్లా అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక తరలింపు విషయంలో కఠినంగా వ్యవహరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.


