కరీంనగర్ అర్బన్: పశు సంవర్థకశాఖ వైద్య సేవలు జిల్లాలో భేష్ అని ఆ శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సుబ్బారాయుడు ప్రశంసించారు. శనివారం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో ఆబోతుల వీర్య కేంద్రాన్ని సందర్శించారు. పశువుల కృత్రిమ గర్భధారణకు ఉపయోగించే వీర్య నాళికల తయారీ, పంపిణీ తీరును ఆరా తీశారు. నగరంలోని కామధేను గోశాలను సందర్శించి అక్కడి ఆవులు ఒకే సమయంలో ఎదకు వచ్చి గర్భధారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి లింగారెడ్డికి సూచించారు. చిగురుమామిడి మండలంలో ఎన్ఎల్ఎం పథకం కింద లబ్ది పొందిన సమ్మిరెడ్డి గొర్రెల ఫారాన్ని సందర్శించారు. అనంతరం జిల్లా పశు సంవర్థక శాఖ కార్యాలయాన్ని సందర్శించగా ప్రాంతీయ పశు సంవర్థక శిక్షణ కేంద్రం కార్యక్రమాలను సమీక్షించి మొక్కలను నాటారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన పెద్ది పోచమ్మకు రూ.లక్ష ఎక్స్గ్రేషియా అందించారు. వి కన్వెన్షన్లో జరిగిన ప్రపంచ పశు వైద్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డా.ఎన్ లింగారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డా.రవి కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.


