
తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. శవమైన తనయుడు
చందుర్తి(వేములవాడ): అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లిన తనయుడు శవమై ఇంటికి రావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన సంఘని లక్ష్మీరాజం ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. పదిహేను రోజుల క్రితం లక్ష్మీరాజం కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో కొడుకు తిరుపతి కరీంనగర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాలుకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ కాలు పై భాగానికి పోయిందని తెలపడంతో కొడుకు తిరుపతి మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం ఉదయం బాత్రూమ్కు వెళ్లిన తిరుపతి అక్కడే పడిపోవడంతో తలకు తీవ్రంగా గాయమైంది. తలలోని నరాలు చిట్లిపోయాయని, వెంటనే ఆపరేషన్ చేశారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్పై ఉన్న తిరుపతి గురువారం మృతిచెందాడు. తిరుపతికి భార్య రజిత, ఆరేళ్ల కుమారుడు గణేశ్ ఉన్నారు.
మమ్మల్ని చూసుకునే దిక్కెవరూ కొడుకా..
పోషించే కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. అయ్యను దవాఖానాకు తీసుకుపోయి నువ్వే ప్రాణాలు పోగొట్టుకుంటివా బిడ్డా.. అంటూ ఆ తల్లి లింగవ్వ రోదనలు స్థానికులను కలచివేశాయి. తండ్రి ఆరేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న కంటికి రెప్పలా చూసుకుంటివి బిడ్డా.. మాకిప్పుడు ఎవరూ దిక్కంటూ గుండెలవిసేలా రోదించింది.
మల్యాలలో మిన్నంటిన రోదనలు

తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. శవమైన తనయుడు