
స్వచ్ఛత పాటిస్తే ర్యాంకు
● 20 గ్రామాల్లో కేంద్ర బృందం పరిశీలన ● నేడు కలెక్టరేట్లో అవగాహన
కరీంనగర్రూరల్: గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ ఏడాదికిగాను వచ్చేనెల మొదటి వారంలో కేంద్ర బృందం పర్యటించనుంది. నాలుగు రకాలుగా గ్రామాల పారిశుధ్య అంశాలు కేంద్ర బృందం సభ్యులు సేకరించి జిల్లాల వారీగా స్వచ్ఛత స్థాయిని అంచనావేస్తారు. గణాంకాలు, నాణ్యత ఆధారంగా జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి ర్యాకులు ప్రకటిస్తారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీ కార్యదర్శులు, స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులకు అవగాహన ఏర్పాటు చేశారు.
మార్కుల ఆధారంగా పురస్కారం..
గ్రామాల్లో చెత్తసేకరణ, వ్యర్థాల నిర్వహణ, కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడుగుంతల నిర్మాణం, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం, పరిశుభ్రత, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర బృందం పరిగణనలోకి తీసుకుంటుంది. నాలుగు అంశాలకుగాను 1000 మార్కులు కేటాయిస్తుంది. సేవా స్థాయిపురోగతికి 240 మార్కులు, ప్లాంట్ల పరిశీలనకు 120, నేరుగా పరిశీలనకు 540, పౌరుల అభిప్రాయాలకు 100 మార్కులు వేస్తారు. మెరుగైన ర్యాంకు సాధిస్తే పురస్కారాలకు ఎంపిక చేస్తారు. జిల్లాలో మొత్తం 318 గ్రామపంచాయతీలుండగా కేంద్ర బృందం 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేయనుంది. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఆయా గ్రామాల్లో సర్వే చేస్తారు. గ్రామంలో 16 ఇళ్లను సందర్శించి ఇంటి యజమానుల అభిప్రాయాలను సేకరిస్తారు. 20 గ్రామాల్లో నెలరోజుల పాటు సర్వే నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. దీని ఆధారంగా స్కోర్, ర్యాంకును ప్రకటిస్తారు. జిల్లాకు మెరుగైన ర్యాంకు రావాలనే ఉద్దేశంతో కలెక్టరేట్లో పంచాయతీకార్యదర్శులు, స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ రమేశ్ తెలిపారు.